దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ మే 2025 పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని, పరీక్షల షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం పరీక్షకు నమోదుచేసుకున్న అభ్యర్థులు ఐసీఏఐ వెబ్సైట్ icai.org. చూడవచ్చని తెలిపింది.
కాగా, షెడ్యూల్ ప్రకారం సీఏ పరీక్షలు మే 2 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్ష మే 3, 5, 7 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రూప్ 1 ఫైనల్ ఎగ్జామ్ 2, 4, 6 తేదీల్లో నిర్వహించగా, గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 13 తేదీల్లో జరగాల్సి ఉంది. అనంతరం జరుగనున్న పరీక్షలు ప్రస్తుతం వాయిదా పడ్డాయి. ఇంటర్కు సంబంధించిన పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఫైనల్ ఎగ్జామ్ పేపర్లు 1 నుంచి పేపర్ 5 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం5 గంటల వరకు, పేపర్ 6 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.