పెద్ద సభలు, భారీ ప్రసంగాలు, రాజకీయ నినాదాలతో సాగే సంప్రదాయ ప్రచారానికి భిన్నంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన రాజకీయ శైలిలో మార్పు తీసుకొస్తున్నారు.ముఖ్యంగా జనరేషన్-జెడ్ (జెన్-జీ), యువతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో నేరుగా మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికలపైనా ఇదే తరహా ముఖాముఖి సంభాషణలను కొనసాగిస్తున్నారు. విద్యార్థుల సమస్యలపై ‘ఛాత్రోంకీ గూంజ్’
యువతకు మరింత చేరువ కావాలన్న ప్రయత్నంలో భాగంగా ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమానికి ప్రాధాన్యం పెరిగింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి,ప్రశ్నపత్రాల లీకేజీలు,విద్యా వ్యవస్థలో నెలకొంటున్న జాప్యం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చలు జరిగాయి. కోటా,డెహ్రాడూన్, ప్రయాగ్రాజ్ వంటి ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం క్రమంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది.
యువతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి
ఇటీవల పుణెలో నిర్వహించిన కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ యువతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కెరీర్లో ఎదురయ్యే అడ్డంకులు, వ్యక్తిగత భద్రత, ఉద్యోగ ప్రదేశాల్లో పరిస్థితులు, కుటుంబం, సమాజం విధించే పరిమితుల గురించి వారితో నేరుగా చర్చించారు. సమాజం తమను ఎలా చూస్తోంది? భయాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? ఎలాంటి హింసను ఎదుర్కొంటున్నారు? ఆ హింస ఎక్కడ, ఏ రూపంలో జరుగుతోంది? వంటి ప్రశ్నలపై యువతులు తమ అనుభవాలను స్వేచ్ఛగా పంచుకోవాలని రాహుల్ గాంధీ కోరారు.
వ్యక్తిగత అనుభవాల ఆధారంగా చర్చలు
మహిళా సహచరులు గతంలో పంచుకున్న వ్యక్తిగత అనుభవాలను కూడా రాహుల్ గాంధీ చర్చల్లో ప్రస్తావిస్తున్నారు. శ్రద్ధ పేరుతో విధించే నియంత్రణ, చిన్న వయసులో వివాహాలు, పితృస్వామ్య భావజాలం, నైతిక పోలీసింగ్, భద్రతకు సంబంధించిన సమస్యలు, వైద్య సదుపాయాల కొరత, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛపై ఆంక్షలు వంటి అంశాలు ఈ చర్చల్లో చోటుచేసుకున్నాయి.
సోషల్ మీడియాలోనూ అదే పంథా
డిజిటల్ వేదికల్లోనూ రాహుల్ గాంధీ తన సంభాషణ శైలిని కొనసాగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ప్రశ్నలు-సమాధానాలు, రీల్స్ వంటి సులభమైన ఫార్మాట్ల ద్వారా యువతకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేకపోవడం, మానసిక ఆరోగ్యం వంటి ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న సమస్యలపైనా ఆయన మాట్లాడుతున్నారు.
ప్రసంగాల నుంచి సంభాషణ వైపు..
రాహుల్ గాంధీ రాజకీయ వ్యూహంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో భారీ సభలు, సుదీర్ఘ ప్రసంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఆయన ఇప్పుడు నేరుగా ప్రజలతో, ముఖ్యంగా యువతతో సంభాషించడంపై దృష్టి పెడుతున్నారు. యువత ఏం ఆలోచిస్తోంది? వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? అనే అంశాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ సంభాషణను కేవలం నాయకుడి ప్రసంగంగా కాకుండా, రెండు వైపులా జరిగే చర్చగా మార్చడమే ఈ కొత్త విధానం వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. యువత అనుభవాలు, అభిప్రాయాలు, సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని రాజకీయ చర్చలోకి తీసుకురావడంపై రాహుల్ గాంధీ దృష్టి సారిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.


