దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త అందించాయి.తాజా నెలవారీ సవరణలో భాగంగా ఈ రోజు నుంచి వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.51.50 తగ్గించాయి. సవరణ అనంతరం దిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,580గా నిర్ణయించారు.అయితే, 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని కంపెనీలు స్పష్టం చేశాయి. ఈ తగ్గింపు వాణిజ్య వినియోగదారులకు గణనీయమైన ఉపశమనం కలిగించనుంది.
వాణిజ్య సంస్థలకు లాభం
ముఖ్యంగా రోజువారీ కార్యకలాపాల్లో ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడే రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలకు ఇది నేరుగా లాభం చేకూరుస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ముడి చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి నెలా ఎల్పీజీ ధరలు నిర్ణయించబడతాయి. ఈ సవరణ కూడా అదే విధానంలో అమలులోకి వచ్చినట్లు సమాచారం.


