ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు తాను బీజేపీలో చేరుతున్నాననడానికి సంకేతాలు కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలను మెచ్చుకుంటూ ఆయన ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో భాజపాలో చేరనున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ ప్రచారంపై థరూర్ తాజాగా స్పందిస్తూ తన వైఖరిని స్పష్టం చేశారు. నిన్న ప్రధాని కార్యాలయం సైతం శశి థరూర్ రాసిన వ్యాసాన్ని ఎక్స్ వేదికగా పంచుకోవడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం వల్ల ప్రపంచ యవనికపై భారతదేశం ఏకాకిగా మారిందంటూ కాంగ్రెస్ పార్టీ తరచూ విమర్శలు చేస్తున్న తరుణంలో, అందుకు భిన్నంగా థరూర్ అభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఈ ఊహాగానాలపై థరూర్ మాట్లాడుతూ, నేను రాసిన వ్యాసం ఆపరేషన్ సిందూర్ విజయాన్ని, అన్ని పార్టీల ఐక్యతను వివరిస్తుంది. ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో ప్రధాని మోదీ ప్రదర్శించిన శక్తి, చైతన్యాన్ని నేను ప్రస్తావించాను. ఇది బీజేపీ లేదా కాంగ్రెస్ విదేశాంగ విధానాలకు సంబంధించిన విషయం కాదు. ఇది పూర్తిగా భారత విదేశాంగ విధానానికి చెందిన అంశంఁ అని తెలిపారు. తాను పార్లమెంటు విదేశాంగ వ్యవహారాల కమిటీ ఛైర్మన్గా 11 ఏళ్ల క్రితం కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని ఆయన గుర్తుచేశారు. తాను ఇలా మాట్లాడటం భాజపాలో చేరడానికి సంకేతంగా భావించరాదని, ఇది కేవలం జాతీయ ఐక్యతకు సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం జరిగిన దౌత్యపరమైన కృషి, భారతదేశ జాతీయ సంకల్పానికి, ప్రభావవంతమైన వ్యక్తీకరణకు నిదర్శనమని థరూర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఇచ్చిన దృఢమైన ప్రతిస్పందన, మన విదేశాంగ విధానంలో ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించిందని ఆయన తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఈ ప్రశంసలు వ్యక్తిగత రాజకీయాలకు అతీతమైనవని, దేశ ప్రయోజనాల దృష్ట్యా చేసినవని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీలో చేరికపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
RELATED ARTICLES