తప్పని చమురు మంటలు తప్పవా!
వాషింగ్టన్: చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచేందుకు కనీసం ఆరు నెలలైనా పడుతుందని తాజాగా పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి విధితమే. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో…ఈ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులు గమనిస్తుంటే… మరో ఆరు నెలలు కొనసాగొచ్చని అంచనా. పెంటగాన్, అమెరికా చట్టసభ సభ్యుల మధ్య మంగళవారం రహస్య సమావేశం జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ సమావేశంలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కీలకమైన నివేదికను చట్టసభ సభ్యులకు వివరించింది. హోర్మూజ్ను పూర్తిగా తెరిచేందుకు ఆరు నెలల సమయం పడుతుందని పేర్కొంది. ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ఉండటం వల్లే ఆలస్యం అవుతుందని తెలిపింది. జలమార్గం, దాని చుట్టుపక్కల 20 లేదా అంతకంటే ఎక్కువ మైన్స్నే ఇరాన్ అమర్చి ఉండవచ్చని తెలిపింది. వాటిలో కొన్నింటికి జీపీఎస్ సాంకేతికత సాయంతో మారుమూల ప్రాంతాల్లో అమర్చినట్లు పేర్కొంది. వీటిని ఇప్ప్పుడు గుర్తించడం తలనొప్పిగా మారిందని వెల్లడించింది. వాటిని పూర్తిగా తొలగించేందుకు సమయం పడుతుందని పేర్కొంది. ఇరాన్తో యుద్ధం ముగిసిన తర్వాతే పూర్తిస్థాయిలో ఈ ఆపరేషన్ చేపట్టడానికి వీలుంటుందని స్పష్టం చేసింది. అమెరికా సాంకేతికతకు సీ మైన్స్ చిక్కడం లేదు. వాటిని గుర్తించడంలో అమెరికా విఫలం అయిందనే చెప్పొచ్చు. అందుకే ట్రంప్ చిందులు తొక్కుతున్నారని విశ్లేషకుల భావన. వాస్తవంగా ఇరాన్ ఆయువు పట్టు అమెరికాకు అంతు పట్టడం లేదు. అందుకే ట్రంప్ చర్చలు పేరిట కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.


