విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నా హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. పేదలకు పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయడం లేదన్నారు. అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలను అమలు చేస్తే పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు .ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి తక్షణమే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ గీతా ప్రియదర్శినికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ నాయకులు గోపాల్, హనుమంతు, మూకన్న, అడివప్ప, గిడ్డయ్య, కల్లుకుంట వీరేష్, ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు.