పదో తరగతి ఫలితాల్లో 98.2 శాతం ఉత్తీర్ణత
ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరు
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి వేదిక విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 98.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏకంగా 98.7% ఉత్తీర్ణత నమోదైంది. గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in/లో చూసుకోవచ్చు. కాగా, ఈ ఏడాది మార్కుల మెమో రూపంలో కొన్ని కీలక మార్పులు చేపట్టారు. గతంలో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, సీజీపీఏలు మాత్రమే ఇచ్చే విధానానికి బదులుగా.. ఈసారి రాత పరీక్షలు, ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను విడిగా చూపిస్తూ.. మొత్తం మార్కులు, గ్రేడ్లను మెమోలో చేర్చారు. కనీస మార్కులు వస్తే పాస్ అని, లేదంటే ఫెయిల్ అని మార్కుల మెమోపై నమోదు చేస్తారు.
ఇక, ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి.