ఇరాన్ పౌర అణు కార్యక్రమానికి అమెరికా ఆర్థిక సాయంపై కథనాలు
30 బిలియన్ డాలర్లు ఇస్తోందన్న ప్రచారాన్ని ఖండించిన ట్రంప్
ఇరాన్ పౌర అణు కార్యక్రమానికి మద్దతుగా అమెరికా సుమారు 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల కోట్లు) ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైందంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ నిరాధారమైనవని ఆయన కొట్టిపారేశారు. ఇదంతా ఃఫేక్ న్యూస్ మీడియాః సృష్టిస్తున్న కల్పిత కథనమని ఆయన మండిపడ్డారు.
ఇటీవల ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించిన కథనం ఈ ప్రచారానికి కారణమైంది. ఇరాన్తో కొత్త దౌత్య ఒప్పందం కోసం ట్రంప్ కార్యవర్గం ప్రయత్నిస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు. దీని ప్రకారం పశ్చిమాసియాలోని ఇరాన్కు చెందిన మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు జరిపిన తర్వాత, శ్వేతసౌధంలో కీలక సమావేశం జరిగినట్లు తెలిసింది. ఈ భేటీలో ట్రంప్ పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో పాటు పలు గల్ఫ్ దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారని కథనం వివరించింది. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే కొందరు ప్రతినిధులు ఇరాన్లోని కీలక నేతలతో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇరాన్ పౌర అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించేందుకు 20 నుంచి 30 బిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని అరబ్ దేశాలు భరించాలని అమెరికా ఆశిస్తున్నట్లు ఆ కథనంలో తెలిపారు. ఎలాగైనా టెహ్రాన్ను చర్చల వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతోనే అమెరికా ఈ ప్రయత్నాలు చేస్తుందనేది ఆ కథనం యొక్క సారాంశం.అయితే, ఈ మొత్తం వ్యవహారంపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరాన్కు ఆర్థిక సహాయం అందిస్తున్నామనే వార్తలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఇదంతా కేవలం ఫేక్ న్యూస్ సంస్థలు ఉద్దేశపూర్వకంగా అల్లిన కథనమని ఆయన స్పష్టం చేశారు.