Homeఅంతర్జాతీయంమేము సంపాదిస్తే తప్పేంటి?.. క్రిప్టో వివాదంపై నోరు విప్పిన ట్రంప్

మేము సంపాదిస్తే తప్పేంటి?.. క్రిప్టో వివాదంపై నోరు విప్పిన ట్రంప్

- Advertisement -

క్రిప్టో వ్యాపారాల ద్వారా ట్రంప్ కుటుంబానికి రూ. 11,600 కోట్లకు పైగా ఆదాయం

క్రిప్టోకరెన్సీ వ్యాపారాల ద్వారా సంపాదించిన భారీ లాభాలపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. తమ వ్యాపార సామ్రాజ్యం సంపాదించిన నిధులలో ఎలాంటి చట్టవిరుద్ధమైన లేదా తప్పుడు విధానాలు లేవని సమర్థించుకున్నారు. ఇటీవల విడుదలైన అధ్యక్షుడి అధికారిక ఆర్థిక సమాచార వెల్లడి పత్రాల ప్రకారం.. 2025 ఒక్క సంవత్సరంలోనే ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో సంస్థలు ఏకంగా 1.4 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 11,600 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాయి. ట్రంప్ తన మొత్తం వార్షిక ఆదాయం 2.2 బిలియన్ డాలర్లుగా చూపించగా.. అందులో సగానికి పైగా క్రిప్టో ద్వారానే రావడం గమనార్హం.

ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది?
వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్లతో కలిసి ప్రారంభించిన ఈ క్రిప్టో ప్లాట్‌ఫాం గవర్నెన్స్ టోకెన్ల విక్రయం ద్వారా 500 మిలియన్ డాలర్లకు పైగా లాభాలు వచ్చాయి.
సీఐసీ డిజిటల్ ఎల్‌ఎల్‌సీ ట్రంప్ పేరుతో నడిచే ‘$TRUMP’ మీమ్‌కాయిన్ లైసెన్సింగ్, ఫీజుల ద్వారా ఈ సంస్థ ఏకంగా 600 మిలియన్ డాలర్ల పైగా ఆర్జించింది.

ట్రంప్ ఏమన్నారంటే?
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యవహారంపై స్పందించారు. తనకు ఈ వ్యాపారాల కచ్చితమైన లాభాల గణాంకాలు తెలియకపోయినప్పటికీ.. ఇవన్నీ చట్టబద్ధమైన వ్యాపారాలేనని ఆయన తేల్చి చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చైనాతో పోటీ పడుతున్నట్లే.. క్రిప్టో రంగంలోనూ అమెరికా అగ్రస్థానంలో నిలవాలనేది నా వ్యూహం. ఇందులో ఎలాంటి ప్రయోజనాల ఘర్షణ లేదు అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాపారాలను తన కుమారులు స్వతంత్రంగా చూసుకుంటున్నారని వైట్ హౌస్ సైతం సమర్థించుకుంది.

మద్దతుదారుల మునక.. నిపుణుల ఆందోళన
ఈ వ్యవహారంపై అమెరికాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్‌ను నమ్మి ఆయన బ్రాండ్ ఉన్న క్రిప్టో కాయిన్స్ కొనుగోలు చేసిన వేలాది మంది రిటైల్ ఇన్వెస్టర్లు (ముఖ్యంగా ట్రంప్ రాజకీయ మద్దతుదారులు) ఘోరంగా నష్టపోయారు. ప్రారంభంలో ఈ కాయిన్స్ అమ్మిన ట్రంప్ సంస్థలు లాభాలు గడించగా, ప్రస్తుతం మెజారిటీ ఇన్వెస్టర్ల క్రిప్టో వాలెట్లు భారీ నష్టాల్లో ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి.

మరోవైపు, క్రిప్టో రంగాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే అధికారంలో ఉన్న దేశాధ్యక్షుడే.. స్వయంగా ఆయా కాయిన్స్ ద్వారా లాభాలు పొందడం నైతికంగా తప్పని నైతిక విశ్లేషకులు, డెమొక్రాట్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు