ఉదారవాదులకే నోబెల్ కమిటీ బహుమతి ఇస్తుందని ట్రంప్ విమర్శ
భారత్-పాక్ మధ్య శాంతికి కృషి చేశానన్న ట్రంప్
తనకు నాలుగైదు సార్లు నోబెల్ రావాల్సిందని వ్యాఖ్య
రువాండా-కాంగో మధ్య శాంతి ఒప్పందం విషయంలో రావాల్సిందన్న అధ్యక్షుడు
అయినా.. నాలాంటి వారికి నోబెల్ ప్రైజ్ ఎందుకిస్తారు లే.. ఉదారవాదులకే నోబెల్ కమిటీ బహుమతి ఇస్తుంది.. అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్వేదాన్ని బయటపెట్టారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఆయనను ఈ పురస్కారానికి నామినేట్ చేసిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో, అలాగే కాంగో-రువాండా సంక్షోభం వంటి పలు అంతర్జాతీయ ఘర్షణల పరిష్కారంలో తాను కీలక దౌత్య ప్రయత్నాలు చేశానని, ఈ కృషికి గాను తనకు ఇప్పటికే నాలుగైదు సార్లు నోబెల్ శాంతి బహుమతి లభించి ఉండాల్సిందని ఆయన అన్నారు. రువాండా విషయంలో నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలి. మీరు గమనిస్తే కాంగో, లేదా సెర్బియా, కొసావో.. ఇలా చాలా చెప్పొచ్చు అని ట్రంప్ పేర్కొన్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనది భారత్- పాకిస్థాన్. నాకు నాలుగైదు సార్లు ఈ బహుమతి వచ్చి ఉండాల్సిందిఁ అని ఆయన పునరుద్ఘాటించారు. కాగా, అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను 2026 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతికి పాకిస్థాన్ అధికారికంగా నామినేట్ చేసింది. ట్రంప్ తన తాజా వ్యాఖ్యల్లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా మధ్య శత్రుత్వాలను అంతం చేసే దిశగా సోమవారం ఒక శాంతి ఒప్పందాన్ని సూచించారు. అయితే, ఈ ఒప్పందం వివరాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఏటా ప్రదానం చేస్తుంది. శాంతిని ప్రోత్సహించడానికి, సంఘర్షణలను పరిష్కరించడానికి చేసిన కృషి ఆధారంగా గ్రహీతలను ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. ట్రంప్ అభ్యర్థిత్వంపై కమిటీ ఎప్పుడూ బహిరంగంగా వ్యాఖ్యానించలేదు.