మేఘాలయ హనీమూన్లో రాజా రఘువంశీ దారుణ హత్య
రాజా భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా ప్రధాన సూత్రధారులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్త రాజా రఘువంశీ హత్యకు సుపారీ ఇచ్చిన సోనమ్ రఘువంశీ నిన్న పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాను అమాయకురాలినని, భర్త హత్యలో తనకెలాంటి పాత్ర లేదని సోనమ్ పోలీసుల విచారణలో వెల్లడించింది. సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా, అతడి స్నేహితులు ముగ్గురు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. కాగా, రాజా రఘువంశీ మృతదేహం ఈ నెల 2న లభ్యం కాగా.. ఆయన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇండోర్ కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు సోనమ్ తల్లిదండ్రులు తమ దగ్గరి బంధువులతో కలిసి హాజరయ్యారు. రాజా మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు, సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా.. ఆమె తండ్రిని ఓదార్చుతూ కనిపించడం గమనార్హం. రాజా రఘువంశీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో సోనమ్ తండ్రిని రాజ్ కుశ్వాహా ఓదార్చడం కనిపించింది.
వివరాల్లోకి వెళితే.. హనీమూన్ కోసం మే 23న మేఘాలయ వెళ్లిన రాజా, సోనమ్ దంపతులు అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా మృతదేహం లభ్యమైంది. సోనమ్ ఆచూకీ లభించలేదు. వారం రోజుల తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసులకు పట్టుబడింది. మేఘాలయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజాను హత్య చేసేందుకు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా ప్లాన్ చేసి వికాశ్, ఆనంద్, ఆకాశ్ అనే ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టి, ఈ ముగ్గురు కిల్లర్లను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో అరెస్ట్ చేశారు.