వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) బొత్స సత్యనారాయణ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో కార్యకర్తలు వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తాలూకు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా బొత్స అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గతంలో రాష్ట్ర మంత్రివర్గంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత కారణంగానే ఇలా జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. అనారోగ్యానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి, ఆ తర్వాత 2015లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బొత్స సత్యనారాయణ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇటీవలే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించారు. తాజాగా ఈ సంఘటనతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సీనియర్ వైసీపీ నాయకులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. త్వరలోనే పార్టీ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు అస్వస్థత
RELATED ARTICLES