నేడు, రేపు భారీ వర్షాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఫలితంగా 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ చత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడిరచారు. దీనికి అనుబంధంగా చత్తీస్గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మన్యం జిల్లా నవగాంలో 73 మిమీ, విజయనగరం జిల్లా పాతకొప్పెర్లలో 68 మిమీ, మన్యం జిల్లా సీతంపేటలో 59.7 మిమీ, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 55 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ వెల్లడిరచారు.


