. గాలేరు`నగరి ద్వారా కడపకు కృష్ణా జలాలు
. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి
. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
. ఉద్యానరంగ అభివృద్ధిపై సీఎం సమీక్ష
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రకాశంతోపాటు, రాయలసీమ ప్రాంతంలోని మొత్తం 10జిల్లాల పరిధిలోని 20 సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని, దానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. అలాగే రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పతులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. 10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువుగా చేపట్టే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై మంగళవారం ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. పూర్వోదయ, సాస్కీ, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఇదే సమయంలో సీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, చాలా వరకు ప్రాజెక్టులను పెండింగులో పెట్టేసిందని మంత్రులు నిమ్మల, పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. 10 జిల్లాల పరిధిలో ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, అలాగే తక్కువ నిధులను కేటాయిస్తే త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులను తొలుత చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ఏడాదిలో ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలి. గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కడప వరకు తీసుకెళ్లే అంశంపై దృష్టి సారించాలి. ఈ దిశగా సుమారు 20కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని సీఎం మార్గనిర్దేశనం చేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టు, అలాగే 4.30 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీళ్లు అందించవచ్చని అధికారులు సీఎంకు తెలిపారు. సీమ ప్రాజెక్టులతో పాటు… ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పోలవరం కుడి కాల్వ పనులు పూర్తి అయితే గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వరకు తీసుకెళ్లవచ్చన్నారు. అప్పుడు పోలవరం-వంశధార నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టవచ్చని సూచించారు. ఈలోగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రాధాన్యతల వారీగా నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రపంచంలో అతిపెద్ద ఉద్యాన క్లస్టర్ గా రాయలసీమ
ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు అపారంగా పెరిగే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. మొత్తం 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లు, 303 మండలాల్లో ఉద్యాన పంటలను అభివృద్ధి చేసేలా ప్రతిపాదించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు తెలిపారు. అలాగే ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని మూడేళ్లల్లో 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు విస్తరించేలా ప్రణాళికలు చేపట్టినట్టు వివరించారు. రాయలసీమ ప్రాంతం ఉద్యాన ఉత్పత్తుల విషయంలో దేశంలోనే అగ్ర స్థానంలో ఉందని, ప్రపంచంలోనే అతిపెద్ద క్లస్టర్ గా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. దుబాయికి చెందిన డీపీ వరల్డ్ సంస్థ ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి సమావేశంలో వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో రాయలసీమ ప్రాంతం ఉద్యాన రంగంలో అభివృద్ధి చెందడానికి ఆస్కారం మెండుగా కన్పిస్తోందని.. దీనికి అనుగుణంగా ఎకో సిస్టం డెవలప్ అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. దీంట్లో భాగంగా అంతర్జాతీయ విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అలాగే స్థానికంగా ఉద్యాన రంగ అభివృద్ధికి అవసరమైన రూరల్ రోడ్ నెట్ వర్క్, లాజిస్టిక్స్, మార్కెట్ కనెక్టివిటీ, గ్లోబల్ కనెక్టివిటీ వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పూర్వోదయ ద్వారా వచ్చే నిధులతో పాటు ఉద్యాన రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను సాధించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పోర్ట్ కనెక్టివిటీ, గోదాములు, కోల్డ్ చైన్ తదితర లాజిస్టిక్స్ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్ సహా ఆర్థిక, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన, పోర్టులు, ఆర్ అండ్ బి శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


