Monday, June 9, 2025
Home‘ఉక్కు’ ఆందోళన పట్టదా?

‘ఉక్కు’ ఆందోళన పట్టదా?

. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పాలకులు నిర్లక్ష్యం వీడాలి
. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్‌
. సమస్యను ప్రధాని దృష్టికి తీసుకొద్దామని పిలుపు
. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల ధర్నాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఈనెల 21వ తేదీన ‘యోగా డే’ కార్యక్రమానికి విశాఖపట్నం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలు విరమించాలని తెలియజెప్పేందుకు వేలాది మంది కార్మికులు తరలిరావాలని ఏఐటీ యూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న సుమారు 5వేల మంది తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ… వారికి సంఫీు భావంగా సోమవారం విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ అధ్వర్యాన కార్మికులు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్‌ లో జరిగిన నిరసన కార్యక్రమంలో రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ సుమారు 1800 రోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యపై పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేటీకరణ చేయమం టూనే మరోవైపు ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటివరకు దాదాపు 5000 మంది కార్మికులను తొలగించారు. శాంతియుతంగా నిరసనలను తెలియజేసే కార్మికులను పోలీసులను మోహరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రైవేటీకరణపై నాలుగు సంవత్సరాలుగా నిరవధిక ఆందోళనలు చేపడుతున్న కార్మికులను, రాష్ట్ర ప్రజల సెంటిమెంటును ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈనెల 21న విశాఖ యోగా డేకు హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రైవేటీకరణ జరగబోదని కార్మికులకు స్పష్టమైన హామీ ఇప్పించాలని రవీంద్రనాథ్‌ కోరారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీిహెచ్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు సొంతగనులు కేటాయించాలి లేదా సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి పోలారి, మరో నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ తొలగించిన కార్మికులను వెంటనే చేర్చుకోవాలని కోరారు. ఈ ధర్నాకు ఏఐటీయూసీ నగర అధ్యక్షులు ఏ ఆంజనేయులు, సీఐటీయూ నాయకులు దుర్గారావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.నగర ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, సోనరాజు, రమణ, సీఐటీయూ నాయకులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో
విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి సుమారు 5500 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించడం… విశాఖ ఉక్కును పరిరక్షించటమా అంటూ ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి ప్రశ్నించారు. పర్మినెంట్‌ ఉద్యోగులను సైతం వీఆర్‌ఎస్‌ పేరుతో పంపించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న కార్మికులకు మద్దతుగా, ప్రభుత్వ నిర్లక్ష్యానికి, నిర్బంధానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌విలాస్‌ సెంటర్‌లో నిరసన చేపట్టారు. సీఐటీయూ నగర కార్యదర్శి కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదరులు ఆకిటి అరుణకుమార,మేడా హనుమంతరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.లక్మణరావు తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో
విశాఖ ఉక్కు పరిశ్రమలో అన్యాయంగా తొలగించిన 5400 కాంట్రాక్ట్‌ కార్మికులను తక్షణం విధులలోకి తీసుకోవాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక శ్యామల సెంటర్‌ వద్ద నిరసనధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా ఉమ్మడి ఉపాధ్యక్షులు జిల్లా కన్వీనర్‌ తాటిపాక మధు, కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కు పొరటంపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ ఉక్కు పరిశ్రమలోపల రాష్ట్ర పోలీసులను మోహరించి పోరాడే కార్మికులపై నిర్బంధం ప్రయోగిస్తున్నారని విమర్శించారు.
కాకినాడలో
కాకినాడ, కలక్టరేట్‌, విశాఖ ఉక్కు పరిశ్రమలో అన్యాయంగా తొలగించిన 5400 కాంట్రాక్ట్‌ కార్మికులను తక్షణం విధులలోకి తీసుకోవాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలక్టరేట్‌ వద్ద నిరసనధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వేంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరి రాజబాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఏలూరులో
ఏలూరు అంబేద్కర్‌ విగ్రహం వద్ద చేపట్టిన కార్యక్రమంలో కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపులు ఆపాలని, విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని,సెయిల్‌లో విలీనం చేయాలని నినదించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టియూ జిల్లా ప్రధాన కార్యదర్శులు కే.బుచ్చిబాబు, డిఎన్‌విడి ప్రసాద్‌, యర్రా శ్రీనివాస్‌, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు