గత ప్రభుత్వంలో స్వరూపానందకు ఇచ్చిన భూములను, తప్పుడు జీవోలతో తక్కువ రేటుకి ఇచ్చిందని స్వాధీనం చేసుకున్న రాష్ట్రంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం, నెల్లూరు జిల్లా గుడ్లురు మండలంలోని చెరువు సర్వే నంబరు 879 లోని చెరువు పోరంబోకును, సర్వే నంబరు 883 లోని అటవీభూమిలో నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న అనాథ పిల్లల స్కూలు పేరుతో, దొంగస్వామి అక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలని నాటి ప్రిన్సిపల్ సెక్రటరి ఉషారాణి మెమో నంబరు 15358 / తో ఆదేశమిచ్చి నాలుగు సంవత్సరాలు గడచింది. కలెక్టరు పంపిన అలయ్ నేషన్ రద్దుచేసి, స్వాధీనం చేసుకోవాలని అదేశం ఇచ్చారు. ఆ జీఓ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. ఎందుకో తెలియదు. ఈ విషయమై ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదకొండునెలల కాలంలో ఇప్పటికి దాదాపు పదిసార్లు ఫిర్యాదు చేశాను. సీఎంఓ కార్యాలయం నుంచి అప్పుడప్పుడు మీ ఫిర్యాదు స్వీకరించాం, సమస్య తీరిందా అని అడుగుతారు. తీరలేదు అని చెప్తాను. ఇక పురోగతి ఉండదు. చాలా నెలలుగా ఇదే పరిస్థితి. అయితే గుడ్లూరు తహసీల్దార్ రెండవ అలయ్ నేషన్ పంపి దొంగస్వామికి ప్రభుత్వభూమి దారాదత్తం చెయ్యాలని చూస్తున్నారు. ఒకసారి ప్రిన్సిపల్ సెక్రటరి అలయ్ నేషన్ రద్దుచేస్తే, రెండవసారి తహసీల్దారు అలయ్ నేషన్ పంపటానికి ఎంత ధైర్యం! ప్రభుత్వ అధికారులు దొంగస్వామి అశ్రమం వారితో కుమ్ముక్కు అయ్యారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? ప్రిన్సిపల్ సెక్రటరి 2021 ఫిబ్రవరి నాడు సుప్రీంకోర్టు తీర్పులను, హైకోర్టు తీర్పులను పరిశీలించి, ఉన్నతాధికారులందరితో సంప్రదించి, దొంగస్వామి అక్రమణలోని భూములను స్వాధీóనం చేసుకోవాలని అదేశాలు జారీచేసింది. ఇప్పటికయినా జిల్లా అధికారులు దొంగస్వామి ప్రలోభాలకు, వత్తిళ్లకు లోనుకాకుండా ప్రిన్సిపల్ సెక్రటరి అదేశాలు అమలుపరచి, అక్రమణలోని భూములను స్వాధీనం చేసుకుంటారని ఆశిద్దాం.
నార్నె వెంకటసుబ్బయ్య
అధ్యక్షుడు, భారత హేతువాద సంఘం