Monday, June 9, 2025
Homeకొమ్మినేని అరెస్టు

కొమ్మినేని అరెస్టు

సాక్షి కార్యాలయాల ఎదుట నిరసనలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి టీవీ వ్యాఖ్యాత, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ లోని జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి గుంటూరుకు తరలించనున్నట్లు తెలిసింది. ఇటీవల సాక్షి టీవీలో కొమ్మినేని నిర్వహించిన చర్చలో జర్నలిస్టు కృష్ణంరాజు… అమరావతిలోని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై పెద్దఎత్తున దుమారం రేగింది. దీనిపై గుంటూరుజిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో రాజధాని రైతులు, మహిళలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం శ్రీనివాసరావును అరెస్టు చేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై చేసిన ఫిర్యాదులతో కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్‌ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. 79, 196(1), 353(2), 299, 356(2), 61(1) బిఎన్‌ఎస్‌, 67 ఐటీఏ-2008, 3(1)(యు), ఎస్సీ, ఎస్టీ, పీఓయే యాక్ట్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఉన్న కృష్ణంరాజు విజయవాడ లోని తన ఇంటికి తాళం వేసి అజ్ఞాతం లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సాక్షి కార్యాలయాల ఎదుట టీడీపీ, మహిళల నిరసనలు
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అనేక ప్రాంతాల్లో సాక్షి కార్యాలయాల ఎదుట నిరసనలు కొనసాగాయి. టీడీపీ, అనుబంధ తెలుగు మహిళా నేతలు, టీఎన్‌ఎఫ్‌ఎస్‌, అమరావతి ప్రాంత రైతులు, జేఏసీ నేతలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఆ పత్రిక కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ఆందోళన కారులు ప్రయత్నించారు. కొన్ని చోట్ల బోర్డులను ధ్వంసం చేశారు. సాక్షి ప్రతులను దగ్ధం చేశారు. మంగళగిరిలోని ఆ పత్రిక కార్యాలయం వద్ద అమరావతి మహిళా రైతులు ధర్నా నిర్వహించారు. మహిళలు అక్కడి కార్యాలయ గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, మహిళలకు మధ్య తీవ్ర వాగ్వివాదం కొనసాగింది. మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ శిరీషతోపాటు మహిళలు, పెద్దఎత్తున అమరావతి రైతులు పాల్గొన్నారు. విజయవాడ ఆటోనగర్‌లోని కార్యాలయం ఎదుట అమరావతి మహిళలు ఆందోళనకు దిగగా, అప్పటికే అప్రమత్తమైన ఆ పత్రిక యాజమాన్యం గేటకు తాళం వేసింది. దీంతో గేటు ఎక్కి మహిళలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిం చారు. అక్కడి సాక్షి కార్యాలయం బోర్డును కూల్చివేశారు. కార్యాలయంలోకి కోడిగుడ్లు విసిరారు. పొన్నూరులో ఎమ్మెల్యే నరేంద్ర అధ్వర్యంలో పెద్దఎత్తున మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కృష్ణాజిల్లా మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గద్దె అనురాధ, అమరావతి రాజధాని జేఏసీ నాయకులు, పువ్వాడ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం, తిరుపతి, కడప, శ్రీకాకుళంలోని సాక్షి ప్రధాన కార్యాలయాల ఎదుట నిరసనలు కొనసాగాయి. అనంతపురంలో పత్రిక బోర్డును తొలగించేందుకు ప్రయత్నించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు