ఇజ్రాయిల్ ఘాతుకం
. ఇరాన్ దాడులకు బలహీనమైన ఐరన్ డోమ్
. పరిపాలన చిహ్నాల ధ్వంసానికి నెతన్యాహు ఆదేశం
తెహ్రాన్/టెల్అవీవ్ : ఇజ్రాయిల్`ఇరాన్ మధ్య ఎనిమిదవ రోజు యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. మరింత భీకరంగా సాగింది. పరస్పర దాడులతో రెండు దేశాలు రగలిపోతున్నాయి. ఇరాన్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఇజ్రాయిల్ సైన్యాధికారి ఇజ్రాయిల్ కట్జ్ శుక్రవారం తమ సైన్యానికి ఆదేశాలిచ్చారు. ఇరాన్ రాజధాని తెహ్రాన్లోని పరిపాలన చిహ్నాల ధ్వంసానికి ఆదేశించారు. ఇరాన్ను పూర్తిస్థాయిలో అస్థిరపర్చేలా ఉత్తర్వులు జారీచేశారు. ‘పరిపాలన సంబంధిత చిహ్నాలపై దాడి చేయండి. పరిపాలనకు పవన్ బేస్గా ఉండే రివల్యూషనరీ గార్డ్స్, బసిజ్ (మిలిషియా) వంటి వ్యవస్థలను ధ్వంసం చేయండి’ అంటూ కట్జ్ ఒక ప్రకటన చేశారు. ఇదే క్రమంలో సెంట్రల్ తెహ్రాన్లోని గిషా జిల్లాలోని అపార్టుమెంట్పై ఇజ్రాయిల్ డ్రోన్ దాడి చేసింది. ఇరాన్ ప్రతీకార దాడులతో జెరూసలేం, టెల్అవీవ్ దద్దరిల్లిపోయాయి. ఆ నగరాల్లో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంటున్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇజ్రాయిల్పై క్షిపణి దాడులను చేపట్టినట్లు ఇరాన్ వెల్లడిరచింది. వరుసగా ఎనిమిది రోజులుగా ఇరాన్ చేస్తున్న క్షిపణి దాడులతో అత్యంత భద్రతమైనదిగా భావించే ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థ బలహీనమైనట్లు సంకేతాలు ఉన్నాయి. కంబైన్డ్ మిసైళ్లు, డ్రోన్లతో హైఫా, టెల్అవీవ్పై దాడి చేసినట్లు ఇరాన్ ధ్రువీకరించింది. పెరుగుతున్న దాడుల తీవ్రతతో ఐరన్ డోమ్కు పగుళ్లు వచ్చినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 657 మంది ఇరాన్ ప్రజలు చనిపోయారని అమెరికాకు చెందిన ఇరాన్ మానవ హక్కుల సంస్థ వెల్లడిరచింది. మృతుల్లో సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలతో పాటు 263 మంది సామాన్యులు ఉన్నారని తెలిపింది. దాదాపు రెండు వేల మందికిపైగా గాయపడినట్లు పేర్కొంది. అలాగే ఇరాన్ దాడులతో ఇజ్రాయిల్లోనూ ప్రాణ నష్టం జరిగిందని, 25 మందికిపైగానే చనిపోయారని వెల్లడిరచింది. ఇరాన్ 450 క్షిపణులు, వెయ్యి డ్రోన్లను ఇప్పటివరకు ఇజ్రాయిల్పైకి ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇరాన్ అధినేత ఆయాతుల్లా ఖామేని ప్రాణాలతో ఉండేందుకు వీల్లేదని, ఆయనను అంతం చేస్తామని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఖామేని కూడా దీటుగా బదులిస్తూ…. ప్రాణత్యాగానికైనా సిద్ధం, తల వంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇదే క్రమంలో ఇజ్రాయిల్పై క్షిపణులతో ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిరది. తమ దేశంలోని బీర్షేబా నగరంలోని అపార్టుమెంట్లు, కార్యాలయాల సముదాయాలు, పారిశ్రామిక ప్రాంతాల సమీపంలో దాడులను ఇరాన్ జరిపిందని ఇజ్రాయిల్ చెప్పింది. క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులను ఇరాన్ ప్రయోగిస్తోందని ఆరోపించింది. ఇలాంటి క్షిపణి వార్హెడ్ 7 కిమీల ఎత్తులో పేలి 20 చిన్న మందుగుండు సామగ్రిగా విడిపోయి కొన్ని ప్రాంతాల్లో పడినట్లు హోమ్ ఫ్రంట్ కమాండ్ తెలిపింది. ఇరాన్కు చెందిన ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులతో ముప్పు ఎక్కువని కలిగిస్తాయని టెల్అవీవ్ అధికారి తెలిపారు. ఈ క్షిపణుల్లో ఒకటి అజోర్ పట్టణంలోని ఓ నివాసాన్ని తాకిందని, ఇందులోని కొన్ని బాంబులు పేలలేదని అధికారులు తెలిపారు. అలాంటివాటిని గుర్తిస్తే వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించారు. యుద్ధ తీవ్రతను పెంచేందుకు ఈ ఆయుధాలను ఇరాన్ ఉపయోగిస్తుందన్నారు. కాగా, 2008లో 111 దేశాలతో సహా 12 ఇతర సంస్థలు క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, బదిలీ, వాడకంపై అంతర్జాతీయంగా నిషేధించినట్లు తెలిపే పత్రంపై సంతకం చేశాయి. ఇరాన్, ఇజ్రాయిల్ మాత్రం అందుకు నిరాకరించాయి.
అమెరికాతో చర్చించే ప్రసక్తే లేదు: ఇరాన్
ఒక వైపు దాడులకు మద్దతిస్తూ, మరోవైపు చర్చిద్దామనడం అమెరికా ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఇరాన్ మండిపడిరది. అమెరికాతో అణు చర్చలకు తావులేదని మరోమారు స్పష్టంచేసింది. దీంతో రెండు వారాల్లోగా దాడులపై నిర్ణయిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామంతో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఇజ్రాయిల్కు అనుకూలంగా ట్రంప్ మాట్లాడుతున్నారని, దీంతో మా దేశంపై దాడుల్లో ఆయన ప్రమేయం ఉందని స్పష్టమవుతోందని అన్నారు. యుద్ధం ఆపాలని ప్రపంచ దేశాల నేతలు కొందరు పిలుపునిచ్చినట్లు తెలిపారు. తమది ఆత్మరక్షణ మాత్రమేనని అరాగ్చీ స్పష్టంచేశారు.
కొత్త రివల్యూషనరీ గార్డ్ నియామకం
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్గా మాజిద్ ఖాదేమి నియమితులయ్యారు. ఇటీవల దాడుల్లో కీలక సైన్యాధికారులను ఇరాన్ కోల్పోయిన క్రమంలో ఈ నిమాయాకానికి ప్రాధాన్యత ఏర్పడిరది.
ట్రంప్ ఆదేశాల కోసం ఆగలేం: నెతన్యాహు
ఇరాన్ అణు స్థావరాలపై దాడికి అమెరికా సిద్ధమవుతున్న క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం ఆగలేమని అన్నారు. ఇరాన్లోని అణు కేంద్రాలన్నింటిని ఇజ్రాయిల్ సమర్థంగా ధ్వంసం చేయగలదన్నారు. ఫోర్డ్లోని భూగర్భ అణుకేంద్రంతో సహా అణు స్థావరాలపై దాడి చేయనున్నట్లు తెలిపారు. ఇరాన్పై దాడిలో కలిసి వస్తారో లేదో ట్రంప్ నిర్ణయించుకోవాలని అన్నారు. తనకు ఇజ్రాయిల్ ప్రయోజనమే ముఖ్యమని నెతన్యాహు చెప్పారు. ఇరాన్పై సైనిక చర్యలు చేపట్టడంపై ట్రంప్ మరో రెండు వారాల్లో నిర్ణయించే అవకాశమున్నట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడిరచాయి.
ఖతార్ నుంచి అమెరికా సైనిక విమానాల తరలింపు!
ఇరాన్పై ఇజ్రాయిల్ భీకర పోరుకు అమెరికా మద్దతు, త్వరలో సైనిక చర్యలకు ఆదేశాలిచ్చే అవకాశాల క్రమంలో ఖతార్ వైమానిక స్థావరం నుంచి ఒక్కొక్కటిగా అమెరికా సైనిక విమానాలు అదృశ్యమవుతుండటంపై అంతర్జాతీయ మీడియాతో కథనాలు వెలువడ్డాయి. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ విమానాలను తరలించినట్లు పేర్కొన్నాయి. రెండు వారాలలో 40 విమానాలు ఆ చిత్రాల్లో నుంచి కనిపించకుండా పోయాయని వార్తా కథనాలు తెలిపాయి. వీటిని ఇరాన్పై దాడుల కోసమే అమెరికా తరలిస్తున్నట్లు అభిప్రాయాలు ఉన్నాయి. ఈనెల 5న ‘ప్లానెట్ ల్యాబ్స్’ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలలో అల్ ఉదీద్ ఎయిర్ బేస్ వద్ద 40 సైనిక విమానాలు కనిపించాయి. వీటిలో హెర్క్యులస్ సీ-130 వంటి రవాణా విమానాలు, నిఘా విమానాలు ఉన్నాయి. అయితే 19వ తేదీన విడుదలైన చిత్రంలో మూడు విమానాలు మాత్రమే కనించాయి’ అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు దగ్గరగా ఉండటంతో అల్ ఉదీద్ ఎయిర్ బేస్లోని విమానాలను అమెరికా తరలించివుండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.