Monday, April 21, 2025
Homeతెలుగు రాష్ట్రాల్లోమళ్లీ ఎన్నికలు

తెలుగు రాష్ట్రాల్లోమళ్లీ ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు
న్యూదిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు, తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. నామినేషన్‌ దాఖలకు మార్చి 10వ తేదీ వరకు గడువు ఇచ్చింది. మార్చి 11వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్లు ఉపసంహరణకు గడువు మార్చి 13వ తేదీగా నిర్ణయించింది. మార్చి 20వ తేదీ ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5.00 గంటలకు ఓట్ల లెక్కింపు… అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ మార్చి 24వ తేదీతో ముగియనుంది. ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌లో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్‌ బాబు, బి. తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడుతోపాటు తెలంగాణలో మహబూబ్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాశ్‌ రెడ్డి, మల్లేశం ఎగ్గే, మిర్జా రియాజుల్‌ హసన్‌ పదవీ కాలం ముగిసిపోనుంది. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడం కేంద్ర ఎన్నికల సంఘానికి అనివార్యమైంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చెరో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రుల కోటాలో జరుగుతోన్న ఈ ఎన్నికల్లో బరిలో దిగిన అభ్యర్థులు ఇప్పటికే తన ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఈ ఎన్నికల ఓట్లను మార్చి 3వ తేదీన లెక్కించనున్నారు. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీలు మొత్తం164 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాయి. వైసీపీకి కేవలం11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కూటమి ఖాతాలో పడనున్నాయి. తెలంగాణలో సైతం కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్‌, బీజేపీ కొన్ని స్థానాలు గెలుచుకొన్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఐదు స్థానాల్లో మూడు లేదా నాలుగు స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలో పడతాయి. ఒక స్థానం బీఆర్‌ఎస్‌ పరమయ్యే అవకాశాలున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు