Wednesday, May 14, 2025
Homeమెట్రోపై మరో ముందడుగు

మెట్రోపై మరో ముందడుగు

. విజయవాడ, విశాఖ ప్రాజెక్ట్‌లకు రూ.12వేల కోట్లు అవసరం
. రుణాలిచ్చేందుకు విదేశీ బ్యాంకుల సుముఖత
. కార్పొరేషన్‌ ఎండీ సంప్రదింపులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విజయవాడ, విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌లపై ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ వేగంగా అడుగులు వేస్తోంది..రెండు మెట్రో ప్రాజెక్ట్‌ లకు సంబంధించి ఇప్పటికే జనరల్‌ కన్సల్టెంట్‌ల నియామకానికి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా… తాజాగా రుణ సమీకరణపై దృష్టి సారించింది. రెండు మెట్రో ప్రాజెక్ట్‌ ల నిర్మాణానికి అయ్యే వ్యయంలో రూ.12 వేల కోట్లు రుణం అవసరం అవుతుందని ఏపీఎంఆర్‌ఎల్‌ అంచనా వేసింది. విజయవాడ మెట్రో కోసం రూ. 5900 కోట్లు,విశాఖపట్నం మెట్రో రైల్‌ కోసం రూ. 6100 కోట్లు రుణం అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల కోసం తక్కువ వడ్డీకి రుణాలు మంజూరుచేసే బ్యాంకులతో ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణా రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. విజయవాడ,విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ లకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఆసక్తి కనబరుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం ఏఐఐబీ బ్యాంకు ప్రతినిధులు సంతోష్‌, పాస్కల్‌ రసెల్‌ తో విజయవాడలోని తన కార్యాలయంలో ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్టారెడ్డి సమావేశమయ్యారు.అంతకు ముందు ఈ బ్యాంకు ప్రతినిధులు విజయవాడలోని ప్రతిపాదిత మెట్రో కారిడార్‌ ల మార్గాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి గన్నవరం వరకూ ఉన్న 26 కిమీ కారిడార్‌ను, అలాగే బస్టాండ్‌ నుంచి పెనమలూరు వరకూ ఉన్న 12 కిమీల కారిడార్‌ ను పరిశీలించిన తర్వాత రుణం ఇచ్చేందుకు ఆసక్తి కనబరిచారు. త్వరలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ బ్యాంకు ప్రతినిధులు సమావేశం కానున్నట్లు ఎండీ రామకృష్ణా రెడ్డి తెలిపారు.మరోవైపు జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు, ఫ్రాన్స్‌ కు చెందిన ఏఎఫ్‌డీ బ్యాంకు,బీజింగ్‌ కేంద్రంగా ఉన్న ఏఐఐబీతో పాటు జపాన్‌ కు చెందిన జైకా, ఏడీబీ, ఎన్‌డీబీ ప్రపంచ బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ముందుకొస్తున్నట్లు ఎండీ తెలిపారు. అయితే వీటిలో తక్కువ వడ్డీతో పాటు మెట్రో ప్రాజెక్ట్‌ త్వరగా పూర్తయ్యేందుకు సహకరించే బ్యాంకులను గుర్తించిన తర్వాత వారితో సంప్రదింపులు జరుపనున్నట్లు మెట్రో కార్పొరేషన్‌ ఎండీ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు