భారీగా ప్రజాధనం దుర్వినియోగం
న్యూదిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఏడాదిలో ఒకసారి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులతో నిర్వహించే ‘పరీక్ష పే చర్చ’ కోసం 2020 నుంచి ఇప్పటివరకు రూ.64.38 కోట్లు ఖర్చు చేశారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. లోక్సభలో ఎంపీలు మాలా రాయ్, మాణిక్కం ఠాకూర్ అడిగిన ప్రశ్నలకు 2020లో రూ.5.69 కోట్లు, 2021లో రూ.6 కోట్లు, 2022లో రూ.8.16 కోట్లు, 2023లో ఏకంగా రూ.27.70 కోట్లు ఖర్చు పెట్టినట్లు విద్యాశాఖ వెల్లడిరచింది. అయితే 2024లో వ్యయాన్ని కాస్త తగ్గించి రూ.16.83 కోట్లు వెచ్చించామని తెలిపింది. 2023కి ముందు వరకు జరిగిన ఖర్చుతో పోల్చితే తర్వాత అమాంతం పెరిగింది. పరీక్ష పే చర్చ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడంతో వ్యయం పెరిగిందని మంత్రిత్వశాఖ చెప్పుకొచ్చింది. కాగా, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఎస్సీ) అప్గ్రేడ్ చేయడంపై రాయ్, ఠాకూర్ ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు.
ఈ పథకం డిజైన్, అమలులో అనేక పరిమితులు ఉన్నట్లు తమకు నివేదికలు అందాయని చెప్పారు. ఈ పథకాన్ని జాతీయ విద్యా విధానంతో అనుసంధానం చేసే దిశగా కసరత్తు సాగుతోందన్నారు. ఇదిలావుంటే, ఈ ఏడాది ఫిబ్రవరి 10న పరీక్ష పే చర్చలో దీపికా పడుకొణె, విక్రాంత్ మస్సీ, భూమి పెడ్నేకర్, ఎంసీ మేరీ కామ్ వంటి ప్రముఖ క్రీడా, సినీ తారలు సందడి చేశారు. ఆధ్యాత్మిక గరువు సద్గురు పాల్గొన్నారు. వీరంతా విద్యార్థులకు సలహాలు, సూచనలు అందించారు. యూపీఎస్సీ, ఐఐటీ`జేఈఈ, సీఎల్ఏటీ, సీబీఎస్సీ, ఎన్డీఏ, ఏసీఎస్సీ తదితర పరీక్షల్లో టాపర్లు కూడా భాగస్వాములయ్యారు.