విశాలాంధ్ర-దుండిగల్: తన చేతకానీ తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ చిల్లర మాటలు మాట్లాడుతూ విద్వేషాలను రెచ్చగొట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్,ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల నగరంలోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్ల పాటు శాంతియుత ఉద్యమాలు చేసి, రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ప్రజలతో ఎన్నుకోబడి బంగారు రాష్ట్ర సాధనకై కృషి చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరుతూ అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్ర ప్రజలు, కెసిఆర్ అభిమానుల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా రెచ్చగొడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలు సంయమనాన్ని కోల్పోవద్దని కాలమే వారికి సరైన బుద్ధి చెబుతుందని, కెసిఆర్, తెలంగాణ సమాజంతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారని వారు తెలిపారు. తమ స్వార్థ చిల్లర రాజకీయాల కోసం బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ స్వార్థం కోసం ఎదుటి ఎదుటివారి నాశనాన్ని కోరుకునే నైజాన్ని, ముఖ్యమంత్రి మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎదుటివారి వినాశనాన్ని కోరుకోవడం సిగ్గుచేటని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, కెసిఆర్ అభిమానులను, బిఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలను తీవ్ర మన వేదనకు గురిచేసాయని, తమ స్వార్థ రాజకీయాల కోసం చిల్లర మాటలు మాట్లాడుతూ విద్వేషాలను రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.