సీఎస్కే జట్టుతో చేరిన శాంసన్
చెన్నై: టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక భూమిక వహించిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుతో కలిశాడు. ఈ నెల 28న ఐపీఎల్ 2026 ప్రారంభం కానుండగా… గురువారం చెన్నై చేరుకున్న సంజూ ఫ్రాంచైజీ క్యాంపులో చేరాడు. సంజూ రాకను పురస్కరించుకుని సీఎస్కే తమ సోషల్ మీడియా ఖాతాల్లో “చెట్టాన్ ఇన్ చెన్నై”, “వరల్డ్ చాంపియన్ సంజు శాంసన్ ఈజ్ హియర” అంటూ ఉత్సాహంగా పోస్టులు పెట్టింది. ఈసారి ఐపీఎల్ వేలంలో భాగంగా సీఎస్కే… ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కరన్లను వదులుకుని, వారికి బదులుగా రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూను వేలం ద్వారా దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆసక్తికరంగా సీఎస్కే తమ తొలి మ్యాచ్ను శాంసన్ మాజీ జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్తోనే ఆడనుంది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న సంజూ… అండర్-19 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగి జట్టుకు శుభారంభం అందించే అవకాశం ఉంది. సీఎస్కేలో చేరడంపై శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. “సీఎస్కేలో భాగమైనందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇప్పటికే ధోనీ భాయ్తో ఫోన్లో మాట్లాడాను. అతడితో కలిసి రెండు నెలలు గడపబోతున్నా. అతడి దగ్గరి నుంచి గమనించి ఎన్నో విషయాలు నేర్చుకునేందుకు ఇదొక గొప్ప అవకాశం” అని తెలిపాడు.
అంతేగాక ప్రపంచకప్ సమయంలో చెన్నై ప్రేక్షకులు తనకు అందించిన మద్దతును గుర్తుచేసుకుంటూ, “చెన్నై ప్రేక్షకుల మద్దతు చూసి ఆశ్చర్యపోయాను. బహుశా నన్ను వారిలో ఒకరిగా చూస్తున్నారేమో. సీఎస్కే కోసం నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను” అని శాంసన్ పేర్కొన్నాడు.


