. బహిష్కృత నేత రిటాబ్రత బెనర్జీకి 58 మంది ఎమ్మెల్యేల మద్దతు
. పార్టీ కమిటీలన్నీ రద్దు చేసిన మమత
. మమ్మల్ని స్పీకర్ గుర్తించారు: చీలిక వర్గం
కోల్కతా: తృణమÖల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తిరుగుబాటు చోటుచేసుకుంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. టీఎంసీలో తిరుగుబాటు బుధవారం నిర్ణయాత్మక మలుపు తీసుకుంది. పార్టీ నుంచి బహిష్కరించబడిన శాసన సభ్యుడు రిటాబ్రత బెనర్జీకి 58 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నాయకుడుగా మద్దతు ప్రకటించి… తమ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్కు తెలియజేశారు. దీనికి ప్రతిగా మమతా బెనర్జీ వర్గం పశ్చిమ బెంగాల్లోని టీఎంసీకి చెందిన అన్ని సంస్థాగత కమిటీలను రద్దు చేసింది. ఈ రెండు పరిణామాలు టీఎంసీ ఏర్పడినప్పటి నుంచి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన అంతర్గత సవాలును సూచిస్తున్నాయి. పార్టీ శాసనసభ విభాగాన్ని, దాని సంస్థాగత యంత్రాంగాన్ని ఎవరు నియంత్రిస్తున్నారనే దానిపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ భవిష్యత్పై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. రిటాబ్రత బెనర్జీ, అలాగే పార్టీ బహిష్కరించబడిన తోటి ఎమ్మెల్యే సందీపన్ సాహా నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం 58 మంది శాసన సభ్యులు సంతకాలు చేసిన మద్దతు లేఖను స్పీకర్ రతీంద్ర బోస్కు సమర్పించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతను నివారించడానికి విడిపోయిన వర్గానికి శాసనసభా పక్షంలో కనీసం మూడింట రెండు వంతుల మద్దతు అవసరం. అసెంబ్లీలో టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఈ కనీస మద్దతు 54గా ఉంది. అసమ్మతి టీఎంసీ శాసనసభ్యులు… సందీపన్ సాహా, సియులి సాహా, జావేద్ ఖాన్ను ప్రతిపక్ష ఉపనాయకులుగా, రఘునాథ్గంజ్ ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్ను తమ చీఫ్విప్గా ఆమోదించారు. సమర్ ముఖోపాధ్యాయ, అరుప్ రాయ్, రతిన్ ఘోష్, జావేద్ ఖాన్, ప్రసూన్ బెనర్జీ సహా అనేక మంది టీఎంసీ సీనియర్ శాసన సభ్యులు తిరుగుబాటు వర్గంలో చేరడం విశేషం. సబినా యాస్మిన్, గోలమ్ రబ్బానీ, ఇమానీ బిశ్వాస్, హమీదూర్ రెహ్మన్, దినేన్ రాయ్, చంద్రనాథ్ సిన్హా, రియాజ్ హోస్సేనీ, గుల్షన్ మాలిక్, పియా పాల్, సుర్జిత్ మిత్రా, ఉష్రానీ మోందల్, అబ్డుల్ అజీజ్ కూడా అసెంబ్లీకి వచ్చారు. ఈ పరిణామం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తన శాసనసభా పక్షంపై పట్టును కోల్పోయిన పరిస్థితికి దారితీసింది.
టీఎంసీ శాసనసభా పక్ష
హోదాకు స్పీకర్ ఆమోదం
తమ తిరుగుబాటు వర్గాన్ని పార్టీ శాసనసభా పక్షంగా గుర్తించాలన్న అభ్యర్థనను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ అంగీకరించారని, దానికి ముఖ్య సలహాదారుగా పని చేయాలని మమతా బెనర్జీని కోరారని రిటాబ్రత బెనర్జీ తెలిపారు. స్పీకర్తో సమావేశమైన అనంతరం అసెంబ్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ టీఎంసీ గుర్తుపై ఎన్నికయిన 58 మంది ఎమ్మెల్యేల సంతకాలను తమ వర్గం సమర్పించిందని, ‘మా అభ్యర్థనను స్పీకర్ ఆమోదించారు’ అని రిటాబ్రత బెనర్జీ చెప్పారు. పార్టీ శాసనసభ్యులలో స్పష్టమైన మెజారిటీ ఇప్ప్పుడు తన వెనుక ఉన్నారని పేర్కొంటూ, సభలో అసమ్మతి వర్గం చట్టబద్ధమైన ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం వహిస్తోందని ఆయన నొక్కి చెప్పారు. ‘టీఎంసీ శాసనసభ పక్షం అనేది టీఎంసీ గుర్తుపై గెలిచిన 58 మంది ఎమ్మెల్యేల బృందం. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాతో చేరే అవకాశం ఉంది. వారు అధికారికంగా తమ మద్దతు ప్రకటించిన తర్వాత, మా బలం మరింత పెరుగుతుంది’ అని తెలిపారు. శాసనసభా పక్షం కొత్త కూర్పును స్పీకర్ ఆమోదించారని, ప్రతిపక్ష నాయకుడి కోసం ఉద్దేశించిన కార్యాలయాన్ని తన కోసం తెరిచారని ఆయన తెలిపారు.
తృణమÖల్ కాంగ్రెస్ కొత్త రూపం తీసుకుందని, రిటాబ్రత బెనర్జీ ప్రతిపక్ష నాయకుడిగా, అఖ్రుజ్జమాన్ను తమ చీఫ్విప్గా ఎన్నుకున్నామని తిరుగుబాటు వర్గానికి చెందిన నాయకుడు ఒకరు తెలిపారు. మమతా బెనర్జీనే తమ నాయకురాలని, శాసనసభ పార్టీ వ్యవహారాలను నిర్ణయించడంలో అభిషేక్ బెనర్జీ అధికారాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా, ‘నిబంధనల ప్రకారం, ఏఐటీసీ, అంటే పార్టీ తరపున ఈ లేఖను ఎవరు సమర్పించారు? అలా చేయడానికి ఎమ్మెల్యేలకు అధికారం లేదు. అసెంబ్లీ స్పీకర్కు సమర్పించిన ఏకైక చెల్లుబాటు అయ్యే లేఖ అభిషేక్ బెనర్జీది మాత్రమే. ఈ చర్య చట్టబద్ధంగా నిలబడదు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. శోభన్ దేవ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నాయకుడిగా నియమించాలన్న పార్టీ నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తూ టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బోస్కు కొత్త లేఖ రాసిన 24 గంటలలోపే, తిరుగుబాటు టీఎంసీ ఎమ్మెల్యేలు ఈ చర్య తీసుకున్నారు.
‘నకిలీ’ సంతకాలపై సీఐడీ విచారణ
పార్టీ అధికారిక ప్రకటనలో చేసిన వాదనకు విరుద్ధంగా మే 6న జరిగిన పార్టీ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడి (ఎల్వోపీ) ఎంపికకు సంబంధించి ఎలాంటి తీర్మానం ఆమోదించబడలేదని రిటాబ్రత బెనర్జీ, సందీపన్ సాహా మే 27న స్పీకర్కు తెలియజేసిన నేపథ్యంలో సంతకాల ఫోర్జరీ ఆరోపణలపై సీఐడీ విచారణ జరుగుతున్న తరుణంలో బుధవారం ఈ పరిణామం చోటుచేసుకుంది. మే 6 తీర్మానం అని పిలవబడేది ‘తయారుచేయబడింది, కల్పితమైనది’ అని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆరోపించారు.


