తమతో విలీనం తప్పదంటూ చైనా హెచ్చరిక
తైపీ: తైవాన్ అతిపెద్ద సైనిక విన్యాసాలను ప్రారంభించింది. చైనా తమపై దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ‘హాన్ కువాంగ్’ పేరుతో 10 రోజుల పాటు ఈ లైవ్-ఫైర్ విన్యాసాలను నిర్వహిస్తోంది. బుధవారం ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తైవాన్ను తమ దేశంలో విలీనం చేసుకోవడం అనివార్యమని చైనా గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో తైవాన్ చర్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ విన్యాసాలలో భాగంగా, చైనా మొదట తమ కమ్యూనికేషన్ వ్యవస్థలపై దాడి చేయవచ్చని అంచనా వేస్తున్న తైవాన్… అలాంటి పరిస్థితుల్లో సైన్యం ఎలా స్పందించాలనే దానిపై ప్రధానంగా దృష్టి సారించింది. సైన్యం, నౌకాదళం, వాయుసేనతో పాటు రికార్డు స్థాయిలో 22,000 మంది రిజర్విస్టులు ఈ విన్యాసాలలో పాల్గొంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని తైవాన్ రక్షణ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విన్యాసాల్లో భాగంగా, అమెరికా నుంచి కొనుగోలు చేసిన శక్తిమంతమైన ‘హిమార్స్’ రాకెట్ సిస్టమ్స్తో పాటు, దేశీయంగా అభివృద్ధి చేసిన ‘స్కై సోర్డ్’ క్షిపణులను తైవాన్ తొలిసారిగా ప్రయోగించనుంది. చైనా తీరానికి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ద్వీపంలోని ఓడరేవులను, కీలక ప్రాంతాలను ఎలా కాపాడుకోవాలనే దానిపై కూడా సైన్యం దృష్టి పెట్టింది. మరోవైపు, తైవాన్ చర్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. హాన్ కువాంగ్ విన్యాసాలు కేవలం బూటకపు ప్రదర్శనలని తెలిపింది. తైవాన్ ప్రజలను రెచ్చగొట్టి, తమ స్వార్థ రాజకీయాల కోసం అధికార డీపీపీ పార్టీ ఆడుతున్న నాటకం ఇదని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ జియాంగ్ బింగ్ పేర్కొన్నారు. తైవాన్ ఎలాంటి ఆయుధాలు ప్రయోగించినా, తమతో విలీనాన్ని అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విన్యాసాలకు ముందు కూడా చైనా తమ గగనతల, సముద్ర జలాల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడిరదని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది.


