కరోనర్ నివేదికలో కీలక విషయాలు
లండన్లోని విలాసవంతమైన హోటల్లో సౌదీ అరేబియా యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ అల్ సౌద్ (29) మృతిచెందిన ఘటనకు సంబంధించి బ్రిటన్ అధికారులు నిర్వహించిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.కెన్సింగ్టన్లోని ప్రముఖ మారియట్ హోటల్లో ఆయన మరణం తొలుత పలు అనుమానాలకు దారితీసినా,దర్యాప్తు అనంతరం ప్రమాదవశాత్తు జరిగిన మత్తు పదార్థాల అధిక వినియోగమే కారణమని అధికారులు నిర్ధారించారు.ప్రిన్స్ అబ్దుల్లా నవంబర్ 19న కెన్సింగ్టన్ మారియట్ హోటల్లో బస కోసం చెక్-ఇన్ చేశారు.నవంబర్ 25న గది శుభ్రం చేసేందుకు వెళ్లిన హోటల్ సిబ్బంది ఐదో అంతస్తులోని బాత్రూమ్లో ఆయన పూర్తి దుస్తులతో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు.
మరణానికి ముందు రోజు సాయంత్రం..
వెంటనే అత్యవసర వైద్య సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ, వారు చేరుకునే సమయానికి ఆయన మరణించినట్లు నిర్ధారించారు.దర్యాప్తు అధికారులు పరిశీలించిన సీసీటీవీ దృశ్యాల ప్రకారం, మరణానికి ముందు రోజు సాయంత్రం సిగరెట్ తాగేందుకు బయటకు వెళ్లిన సందర్భమే ఆయన చివరిసారిగా కనిపించిన దృశ్యంగా నమోదైంది.పోస్ట్మార్టం, టాక్సికాలజీ నివేదికల ప్రకారం ప్రిన్స్ అబ్దుల్లా రక్తంలో 100 మిల్లీలీటర్లకు 222 మిల్లీగ్రాముల ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు.ఇది ఇంగ్లాండ్లో డ్రింక్ అండ్ డ్రైవ్కు అనుమతించిన పరిమితికంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు.
గతంలో పునరావాస కేంద్రాల్లో చికిత్స పొందిన ప్రిన్స్ అబ్దుల్లా
ఆల్కహాల్తో పాటు ప్రమాదకరమైన పార్టీ డ్రగ్గా గుర్తింపు పొందిన గామా-హైడ్రాక్సీబ్యూటిరేట్ ,గంజాయి, ఆందోళన నివారణకు ఉపయోగించే జానాక్స్ తో పాటు ఇతర యాంటీ-యాంగ్జైటీ మందులను ఒకేసారి తీసుకోవడం వల్ల గుండె పనితీరు దెబ్బతిని మరణించినట్లు వైద్య నిపుణులు కోర్టుకు వివరించారు.విచారణలో మరో కీలక విషయం కూడా బయటపడింది. మద్యం, మత్తు పదార్థాల వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రిన్స్ అబ్దుల్లా గతంలో పలు పునరావాస కేంద్రాల్లో చికిత్స పొందినట్లు అధికారులు వెల్లడించారు.
2025 ఆగస్టులో లండన్లోని ప్రయరీ క్లినిక్లో, అదే ఏడాది అక్టోబర్లో రైన్ఫోర్డ్ హాల్ క్లినిక్లో డిటాక్స్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, కొద్ది రోజులకే మళ్లీ పాత అలవాట్లకు లోనైనట్లు విచారణలో తేలింది.
సౌదీ రాజ దర్బార్ తీవ్ర విచారం
ఈ కేసులో ఎలాంటి కుట్ర,బలవంతపు చర్య లేదా మూడో వ్యక్తి ప్రమేయం లేదని అసిస్టెంట్ కరోనర్ జీన్ హార్కిన్ స్పష్టం చేశారు.అలాగే ఇది ఆత్మహత్య కాదని, మద్యం, మత్తు పదార్థాలు,మందులను అధిక మోతాదులో కలిపి తీసుకోవడం వల్ల జరిగిన ప్రమాదవశాత్తు మరణమని తుది తీర్పు వెల్లడించారు.ఈ ఘటనపై సౌదీ రాజ దర్బార్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.డిసెంబర్ 2న ప్రిన్స్ అబ్దుల్లా మరణాన్ని అధికారికంగా ప్రకటించిన రాజ దర్బార్, ఆయన విదేశాల్లోనే దేవుని కరుణకు పాత్రులయ్యారని పేర్కొంది.
అలాగే రియాద్లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాజకుటుంబ సభ్యుల అంత్యక్రియలు సాధారణంగా నిర్వహించే ఇదే మసీదులో ప్రిన్స్ అబ్దుల్లాకు తుది వీడ్కోలు పలకనున్నట్లు ధృవీకరించింది. ఈ విచారణతో యువరాజు మరణంపై నెలకొన్న అన్ని అనుమానాలకు తెరపడగా, ప్రమాదవశాత్తు మత్తు పదార్థాల అధిక వినియోగమే ఆయన ప్రాణాలు కోల్పోవడానికి కారణమని అధికారికంగా తేలింది.


