- అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే
- ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి
- నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపర చర్యలు తప్పవు
- అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు
- సంయుక్త రవాణా కమిషనర్ ఎ.మోహన్
విశాలాంధ్ర`విజయవాడ:ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రయాణికులపట్ల మర్యాదగా ప్రవర్తించాలని, వాహనాల్లో తప్పనిసరిగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని సంయుక్త రవాణా కమిషనర్ (జేటీసీ) ఎ.మోహన్ తెలిపారు.
సంక్రాంతి పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేసినా, దురుసుగా ప్రవర్తించినా ఊరుకునేది లేదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. సంక్రాంతి నేపథ్యంలో స్థానిక డీటీసీ కార్యాలయంలో శుక్రవారం ఆర్టీవోలు ఆర్.ప్రవీణ్, వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు, ప్రతినిధులతో సమావేశంను నిర్వహించామన్నారు. సంక్రాంతి పండగను ఆసరాగా తీసుకొని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యజమానులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తున్నాయని, అలాంటి వాహనాలపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేయడం కూడా జరుగుతుందన్నారు. ప్రయాణికులకు నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికే మోటారు వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి, విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, ఇతర ప్రయాణ వాహనాలు తప్పనిసరిగా ప్రయాణికుల వివరాలను, వాహన రికార్డులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వాహన యజమానులు, డ్రైవర్ల నుంచి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా 9281607001 టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేయవచ్చని జేటీసీ ఎ.మోహన్ సూచించారు.


