ఎస్ఐఆర్పై చర్చకు విపక్షాల పట్టు
. ముందుకురాని అధికార పక్షం
. ఉభయసభల్లో ఆందోళనలు
న్యూదిల్లీ: ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంటు బుధవారం దద్దరిల్లింది. ఎస్ఐఆర్పై చర్చ కోసం విపక్షాల పట్టు, అధికార పక్ష విముఖతతో ఉభయ సభలలో వాయిదాల పర్వం కొనసాగింది. బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓట్ల తొలంగింపు ఆరోపణలతో, ఈ అంశంపై సమగ్ర చర్చ కోసం ప్రతిపక్షాలు ఐక్యంగా డిమాండ్ చేశాయి. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నినాదాలిచ్చాయి. దీంతో లోక్సభ, రాజ్యసభలో గందరగోళం నెలకొంది. అయినప్పటికీ లోక్సభలో మెర్చంట్ షిప్పింగ్ బిల్లు2024, రాజ్యసభలో క్యారేజి ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు2025కు ఆమోదం లభించింది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖడ్గే మాట్లాడుతూ సభలో ప్రతిపక్ష సభ్యులపై సభాపతి వివక్ష చూపుతున్నారని, వారితో అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ విజ్ఞప్తిని పట్టించుకోలేదని, డిప్యూటీ చైర్మన్ తీరు సరైనది కాదని ఖడ్గే వ్యాఖ్యానించారు. అధికార పక్ష సభ్యుడు జేపీ నడ్డా స్పందిస్తూ సభను రసాభాస చేసే వారికి పాయింట్ ఆఫ్ ఆర్డర్ గురించి మాట్లాడే హక్కు లేదని, సభాపతి మాటకు తిరుగు లేదన్నారు. దీంతో ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం అయింది. అప్పుడప్పుడు తమ మాట కూడా వినాలంటూ సభాపతిని ఉద్దేశించి అన్నారు. బీహార్ ఎస్ఐఆర్పై చర్చ కోసం నినాదాలు కొనసాగించారు. దీంతో బిల్లుపై చర్చలో పాల్గొనాలని సభాపతి కోరగా, వారు పట్టించుకోలేదు. గంరదగోళ పరిస్థితుల మధ్య క్యారేజి ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లును ఎన్జేపీ ఎంపీ సంజయ్ సేత్ ప్రవేశపెట్టారు. అటు లోక్సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఎస్ఐఆర్ చర్చ కోసం ప్రతిపక్ష సభ్యులు డిమాండ్, నినాదాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తప్పుపట్టారు. ఏ అంశంపై చర్చించేందుకైనా కేంద్రం సిద్ధంగా ఉంది కానీ, అది రాజ్యాంగ నిబంధనల పరిధిలో ఉండాలన్నారు. న్యాయ విచారణలో ఉన్న ఎస్ఐఆర్పై పార్లమెంటులో చర్చ కుదరదని చెప్పారు. సభ్యుల నినాదాలు, ఆందోళలతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. తిరిగి సమావేశమై నప్పుడు ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. ప్రతిపక్షాల నినాదాలు కొనసాగుతుండగానే మణిపూర్ బడ్జెట్ వ్యయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఎంపీలు సమర్పించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ ఓం బిర్లా అంగీకరించలేదని సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా సభకు తెలిపారు. అటు రాజ్యసభలోనూ నిబంధన 267 కింద సభ్యులు ఇచ్చిన నోటీసులను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. లోక్సభ ఉదయం ప్రారంభమైనప్పుడు రెండవ ప్రపంచ యుద్ధమప్పుడు జపాల్లోని హిరోషిమా`నాగసాకిపై అణు బాంబు దాడికి 80 ఏళ్లు అయినట్లు స్పీకర్ గుర్తుచేశారు. నాటి విపత్తు బాధితుల గౌరవార్ధం సభ రెండు నిమిషాల మౌనం పాటించింది. రాజ్యాసభ కార్యక్రమాల ప్రారంభానికి ముందు జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సంతాపం ప్రకటించారు.


