అణు యుద్ధానికి వెనుకాడం
. క్షిపణుల కొరత లేదు
. సింధూపై భారత్ నిర్మాణాలు కూల్చేస్తాం
. పాక్ సైన్యాధికారి మునీర్ బెదిరింపులు
. భయపడం: భారత్
వాషింగ్టన్/న్యూదిల్లీ : పాకిస్థాన్ అణుశక్తి… అవసరమైన అణు యుద్ధం చేయగలదు. మనుగడకు ముప్పు ఏర్పడితే తనతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేయగలదు అని ఆ దేశ సైన్యాధికారి అసీం మునీర్ వక్కాణించారు. అమెరికా గడ్డ నుంచి ఓ దేశం… మరో దేశాన్ని అణ్వస్త్రాల పేరిట బెదిరించడం మునుపెన్నడూ జరగలేదు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మునీర్ ఫ్లోరిడాలోని టాంపాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ను కవ్వించేలా మాట్లాడారు. ‘భవిష్యత్లో భారత్తో యుద్ధం వచ్చి మా మనుగడకు ముప్పు ఏర్పడితే… మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేసేందుకు వెనుకాడబోం’ అని అన్నారు. భారత్తో సింధూ జల సంధి రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ ‘సింధూ నదిపై భారత్ ఆనకట్టలు నిర్మిం చేంత వరకు ఎదురుచూస్తాం. ఆపై 10 క్షిపణులతో పేల్చేస్తాం. మా వద్ద క్షిపణుల కొరతలేదు’ అని మునీర్ వ్యాఖ్యానించారు. అటు భారత్ కూడా దీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమని పేర్కొంది. అణ్వస్త్రాల పేరిట హెచ్చరించడం పాక్కు పరిపాటిగా మారిందని, ఇలాంటి వాటికి బెదిరేది లేదని తేల్చిచెప్పింది. మునీర్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్లో పహల్గాంలో దాడి అనంతరం సింధూ జల సంధిని భారత్ రద్దు చేసిందని, దీంతో 25 కోట్ల మంది ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుందని వెల్లడిరచారు. సిందూ నది భారతీయుల సొంతం కాదన్నారు. భారత్ సైనిక ఘర్షణను ప్రస్తావిస్తూ ఆ నాలుగు రోజులలో జరిగిన నష్టం గురించి సమాచారం ఇవ్వరాదన్న భారత్ నిర్ణయాన్ని ప్రశ్నించారు. భారత్ తనకు జరిగిన నష్టాన్ని అంగీకరించాలి. క్రీడాస్ఫూర్తి ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. భారత్ నష్టాలు ప్రకటిస్తే… పాకిస్థాన్ కూడా తనకు జరిగిన నష్టాన్ని ప్రకటిస్తుందని మునీర్ వెల్లడిరచారు. భారత్ను మెరిసే మెర్సిడెజ్ కారుతో పోల్చారు. పాకిస్థాన్ను కంకర మోసుకెళ్లే ట్రక్కుగా వర్ణించారు. ట్రక్కు వెళ్లి కారును ఢీకొడితే ఏమవుతుంది? ఎవరికి నష్టం జరుగుతుంది? అంటూ ప్రశ్నించారు. కశ్మీర్ గురించి మాట్లాడుతూ అది పాకిస్థాన్కు ‘జగ్లర్ వెయిన్’ అని, ఇందులో మలినాలు ఉండటానికి వీల్లేదని అన్నారు. కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ మరువదని ఆయన గతంలోనూ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ను ప్రస్తావిస్తూ ‘భారత్కు ఇస్తామాబాద్కు మధ్య ఇటీవల ఘర్షణ జరిగింది. భారత్కు దీటైన బదులిచ్చాం. మళ్లీ ఇలాంటివి జరిగితే అదే స్థాయిలో బదులిస్తాం’ అని మునీర్ అన్నారు. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారం కాదని అసంపూర్తి అంతర్జాతీయ అజెండా అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాపాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత నిర్మాణాత్మకంగా, సుస్థిరంగా, సానుకూల పథంలో సాగాలన్నదే తన పర్యటనల ఉద్దేశంగా మునీర్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పాకిస్థాన్ రుణపడి ఉందని, ఆయన వ్యూహాత్మక నాయకత్వంతో పాకిస్థాన్భారత్ మధ్య యుద్ధం ఆగిందని, ప్రపంచ వ్యాప్తంగానూ అనేక యుద్ధాలకు ఆయన తెరదించారని అన్నారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం ద్వారా తమ దేశానికి భారీగా పెట్టుబడులు వస్తాయని ఆకాంక్షించారు. ఇదిలావుంటే, అసీం మునీర్ అమెరికా వెళ్లడం రెండు నెలల్లో ఇది రెండోసారి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇచ్చారు. ఆ సమయంలో ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని మునీర్ ప్రతిపాదించారు. భారత్పై ట్రంప్ సుంకాల భారం వేళ మునీర్ అమెరికాలో పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడిరది. మరోవైపు పాకిస్థాన్ తదుపరి అధ్యక్షుడిగా మునీర్ పేరు వినిపిస్తోంది.
అమెరికా అండతో పాక్ కవ్వింపు: భారత్
‘పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన ఉన్మాద దేశం… అమెరికా అండతో నిజ రూపం బయటపెట్టుకుంది’ అని కేంద్ర విదేశాంగ శాఖ (ఎంఈఏ) వ్యాఖ్యానించింది. అమెరికా గడ్డపై ఉంచి పాకిస్థాన్ సైన్యాధికారి చేసిన అణు బెదిరింపులను ఖండిరచింది. ‘అణ్వస్త్రాల పేరిట బెదిరించడం పాకిస్థాన్కు కొత్తేమీ కాదని, తన దుర్మార్గపు మనస్తత్వాన్ని మరోమారు బయటపెట్టుకుందని విమర్శించింది. ఆ దేశం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని, పాక్ అణ్వాయుధాలపై నియంత్రణ ఎవరిదో కూడా స్పష్టమైందని ఎంఈఏ సోమవారం ఒక ప్రకటన చేసింది. అణు బెదిరింపులకు భారత్ భయపడదని, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమని వెల్లడిరచింది. అమెరికా గడ్డపై నుంచి పాకిస్థాన్ ఇలా బెదిరింపులకు పాల్పడటం దురదృష్టకరమని ఎంఈఏ వ్యాఖ్యానించింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు కూడా స్పందించాయి. ‘అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా వారు (పాక్) తమ నిజస్వరూపాన్ని బయటపెడుతూనే ఉంటారు. అక్కడ (పాక్) ప్రజాస్వామ్యం లేదని తెలుస్తోంది. ఆ దేశాన్ని సైన్యమే నియంత్రిస్తోంది. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఈ ప్రాంతంతో పాటు ప్రపంచానికి ముప్పు’ అని పేర్కొన్నాయి.


