ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీ హెచ్చరిక
. ఇజ్రాయిల్పై క్షిపణుల వర్షం
. ఎయిర్పోర్టులు లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు
. తీవ్ర నష్టం కలిగించామన్న ఐడీఎఫ్
. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం
టెల్అవీవ్/తెహ్రాన్: ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడి చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా, ఇజ్రాయిల్ దాడులపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికాకు కోలుకోలేని గాయం ఏర్పరుస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామేనీ హెచ్చరించారు. అమెరికాకు గట్టి సమాధానం ఇస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా హెచ్చరించారు. ప్రపంచదేశాలకు ముడి చమురు, సహజ వాయువు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేసే ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిపై ఖమేనీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో విస్తృత ప్రాంతీయ సంఘర్షణలు రేకెత్తే ప్రమాదం పొంచి ఉందని…ఇరుదేశాలు సంయమం పాటించాలని పిలుపునిచ్చాయి. మరోవైపు ఇజ్రాయిల్-ఇరాన్ పరస్పర దాడులు కొనసాగిస్తున్నాయి. సోమవారం ఉదయం ఇజ్రాయిల్ వాయుసేన తెహ్రాన్లోని కెర్మాన్షా ప్రాంతంలోని ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ స్థావరాల ను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. ఆరు విమానాశ్రయాలపై దాడులు చేసి, 15 సైనిక విమానాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో రన్వేలు, భూగర్భ బంకర్లు, ఒక రీఫ్యూయెలింగ్ విమానం, ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ఎఫ్-14, ఎఫ్-5, మరియు ఏహెచ్-1 విమానాలు ధ్వంసమైనట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్లో రిమోట్గా నడిచే మానవరహిత విమానాలను (డ్రోన్లు) ఉపయోగించినట్లు పేర్కొంది. ఈ దాడి తర్వాత ఇరాన్ సైతం ఇజ్రాయిల్పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిరది. రాజధాని జెరూసలేం, టెల్అవీవ్ సహా ప్రధాన నగరాలపై దాదాపు 15 క్షిపణులను ప్రయోగించింది. జెరూసలేంలో పెద్ద ఎత్తున పేలుళ్లు వినిపించినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఏఎఫ్పీ నివేదించింది. ఉత్తర ఇజ్రాయిల్ అంతటా సైరన్లు మోగినట్లు పేర్కొంది. ఈ దాడులను ఇజ్రాయిల్ సైన్యం కూడా ధృవీకరించింది.
ఇజ్రాయిల్ దాడుల్లో 500కు చేరిన మృతులు: ఇరాన్ మీడియా
ఇరాన్పై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దాడుల కారణంగా మృతిచెందినవారి సంఖ్య 500కు చేరిందని ఇరాన్ మీడియా వెల్లడిరచింది. ఈ దాడుల్లో సుమారు మూడు వేల మంది గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. జూన్ 13వ తేదీ నుంచి ఇజ్రాయిల్, ఇరాన్పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మీడియా సంస్థలపై ఇరాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో, ఆ దేశంలోకి ప్రవేశించడం అనేక వార్తా సంస్థలకు సాధ్యపడటం లేదు. దీంతో ఇజ్రాయిల్ దాడుల వల్ల జరిగిన వాస్తవ నష్టంపై స్పష్టమైన అంచనాకు రావడం కష్టతరంగా మారింది. అయితే, ఇరాన్లో పనిచేస్తున్న మానవ హక్కుల సంస్థలు మాత్రం మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే రెట్టింపుగా ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఫర్దో భూగర్భ అణుకేంద్రంపై మరోసారి దాడి జరిగినట్లు ఆ దేశ అధికారిక మీడియా పేర్కొంది. అయితే ఈ దాడి వల్ల ఏ మేరకు నష్టం జరిగిందో వెల్లడిరచలేదు. అమెరికా- ఇరాన్లోని మూడు అణుకేంద్రాలపై దాడి చేసిన ఒక్కరోజు తరువాత మళ్లీ అదే తరహా దాడి జరగడం గమనార్హం. అయితే ఈ దాడి ఎవరు చేశారనేది మీడియా వెల్లడిరచలేదు. ఇజ్రాయిల్ తో ఘర్షణ కొనసాగుతున్న వేళ, ఆ దేశమే దాడి చేసిందన్న ఊహాగానాలు విపిస్తున్నాయి.
నిలిచిన విమాన రాకపోకలు
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ గగనతలంలోకి వాణిజ్య విమానాలు ప్రవేశించడం లేదు. తాజా సమాచారం ప్రకారం, ఇరాన్తో పాటు ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్ గగనతలాలను కూడా వాణిజ్య విమానయాన సంస్థలు పూర్తిగా దూరం పెట్టినట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం సుమారు 120 విమానాలు ఆలస్యంగా నడిచాయి. జోర్డాన్లోని క్వీన్ అలియా అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 40 శాతం విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. యునైటెడ్ ఎయిర్లైన్స్ సంస్థ దుబాయ్కి వెళ్లే తమ విమానాలను జూలై 3వ తేదీ వరకు రద్దు చేయగా, బ్రిటీష్ ఎయిర్వేస్ కూడా దుబాయ్, దోహాలకు తమ విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
తగిన సమయంలో దీటుగా స్పందిస్తాం:ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్ ఇటీవల చేపట్టిన వైమానిక దాడులపై ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ తీవ్రంగా స్పందించారు. అమెరికాపై తగిన సమయంలో స్పందిస్తామని పేర్కొన్నారు. ఆదివారం న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘తమకు పూర్తి రక్షణ హక్కు ఉంది. అమెరికా, ఇజ్రాయిల్ చేసిన దాడులపై ఇరాన్ తగిన విధింగా స్పందిస్తుంది. ఆ స్పందన ఎప్పుడు, ఎలా, ఏ స్థాయిలో ఉంటుందో ఇరాన్ సైనిక బలగాలే నిర్ణయించేది. మరోవైపు దౌత్యాన్ని ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా దౌత్య మార్గాన్ని నాశనం చేసింది. తాము సమాధానానికి సిద్ధంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ నటించినా, అది అంతర్జాతీయ సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నమే అవుతుంది’ అని ఆయన అన్నారు.
ఇరాన్ క్షిపణుల పరిధిలో అమెరికన్ దళాలు
ప్రస్తుతం పశ్చిమాసియాలో దాదాపు 10వేల మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. వీరు ఉంటున్న స్థావరాలు చాలా వరకు స్వల్ప-శ్రేణి ఇరాన్ క్షిపణుల పరిధిలోనే ఉన్నాయి. మరి వీటిపై ఇరాన్ దాడి చేస్తుందో, లేదో చూడాలి. మరోవైపు, ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో తమ లక్ష్యాలను సాధించడానికి ఇజ్రాయెల్ చాలా దగ్గరగా ఉందని, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి, అణు కేంద్రాలకు ఇప్పటికే గణనీయమైన నష్టం కలిగించామని ఆయన పేర్కొన్నారు. తెహ్రాన్తో సుదీర్ఘకాలం పోరాటం చేయడానికి తాను ఇష్టపడనని స్పష్టం చేశారు.