ముంబై: సంచలనం సృష్టించిన ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడు శ్రీకాంత్ పాంగార్కర్ జాల్నా కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాడు. 13వ వార్డు నుంచి శ్రీకాంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. బీజేపీతోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు పోటీలో ఉండగా… ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మాత్రం అభ్యర్థిని నిలబెట్టలేదు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాంగార్కర్ శివసేనలో చేరాడు. అయితే, దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని షిండే నిలిపివేశారు. అంతకుముందు శివసేన తరఫున 2001-2006లో జాల్నా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న పాంగార్కర్… 2011లో టికెట్ నిరాకరించడంతో హిందూ జనజాగృతి సమితిలో చేరాడు. జర్నలిస్టు గౌరీ లంకేశ్ను 2017 సెప్టెంబర్లో బెంగళూరులోని ఆమె నివాసంలో దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన పాంగార్కర్కు 2024లో కర్నాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు 2018లో బాంబులు, ఆయుధాలు లభ్యమైన కేసులో మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ ఆయనను అరెస్టు చేసింది.


