న్యూదిల్లీ: క్యాష్ ఎట్ హోం కుంభకోణం కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న పార్లమెంటరీ ప్యానెల్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. క్యాష్ కుంభకోణంలో ఆయనపై అభిశంసన ప్రక్రియ కొనసాగుతోంది. పిటిషన్ కొట్టేయడంతో అభిశంసన ప్రక్రియకు మార్గం సుగమం అయినట్లు అయింది. జస్టిస్ యశ్వంత్ వర్మ విజ్ఞప్తిపై ఈ నెల ఎనిమిదో తేదీన నిర్ణయాన్ని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్.సి.శర్మలతో కూడిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ధర్మాసనం పిటిషన్ కొట్టేసింది. దీంతో జస్టిస్ వర్మ… పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. కాగా, 2025, మార్చి 14వ తేదీ రాత్రి జస్టిస్ యశ్వంత వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చెల్లాచెదురుగా పడి ఉన్న నగదు గుర్తించారు. ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. నగదు వీడియోలను రికార్డ్ చేసి దిల్లీ పోలీసులు… సీనియర్ అధికారులకు పంపారు. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తికి సమాచారం అందించారు. దీంతో అప్పటి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నా విచారణకు ఆదేశించారు. దాదాపు రూ.15 కోట్ల వరకు నగదు ఉంటుందని సమాచారం. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం… జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. కానీ ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ కూడా నగదు ఉన్నమాట వాస్తవమేనని తేల్చింది. మే 4న కమిటీ నివేదిక ఇచ్చింది.


