వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేశ్ను నియమించాలని ప్రతిపాదన
విశాలాంధ్ర బ్యూరో – కడప : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న మహానాడులో రెండవ రోజు బుధవారం ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య టీడీపీ ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. 1995లో చంద్రబాబు తొలిసారి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 ఏళ్లుగా ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నారు. ప్రతి రెండేళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా మహానాడులో చంద్రబాబును మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నాయకులు ఎన్నుకున్నారు. మహానాడు రెండవ రోజున పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి చంద్రబాబు నామినేషన్ను అనేక మంది నేతలు ప్రతిపాదించగా పార్టీ నేతలంతా మద్దతు తెలిపారు. దీంతో చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కడపతో కలుపుకుని ఇప్పటి వరకు 25 మహానాడులు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లు జూమ్ ద్వారా మహానాడు నిర్వహించారు. చంద్రబాబును ప్రస్తుతం 12వ సారి టీడీపీ అధినేతగా మహానాడు ఎన్నుకుంది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబుతో వర్ల రామయ్య ప్రమాణం చేయించారు. టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుని హోదాలో తనకు ఈ అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు వర్ల రామయ్య కృతజ్ఞతలు తెలిపారు.
వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేశ్కు బాధ్యతలు అప్పగించాలి
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించాలంటూ మహానాడులో సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి పయ్యావుల కేశవ్, దూళిపాళ్ల నరేంద్ర తదితరులు ప్రతిపాదించారు. టీడీపీ మరింత బలోపేతం కావాలంటే లోకేశ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్నది సహేతుకమైన నిర్ణయమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నది నీడ్ ఆఫ్ ది అవర్ అని అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా సరైన సమయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆకాంక్షించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ శ్రేణుల సంక్షేమానికి పాటుపడటంతో పాటు యువగళం ద్వారా ప్రజలకు మరింత చేరువై, మంత్రిగా లోకేశ్ సక్సెస్ అయ్యారని సోమిరెడ్డి కొనియాడారు. పార్టీలో యువరక్తం పెంపొందించి టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్లాంటి కీలక బాధ్యతలు అప్పగించాలని కోరారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా లోకేశ్కు కీలక పదవి ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ప్రతిపాదించారు. లోకేశ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని తాము గుంటూరు మినీ మహానాడులో తీర్మానించామని సీఎం చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా దూళిపాళ్ల నరేంద్ర చెప్పారు. పార్టీ శ్రేణులందరూ కోరుకుంటున్న విధంగా నారా లోకేశ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎంకు నరేంద్ర విజ్ఞప్తి చేశారు.