. జీఎస్టీ వసూళ్లలో ఆదర్శంగా ఏపీ
. డేటా అనలటిక్స్తో పన్నుల విశ్లేషణ
. డేటా లేక్ ద్వారా ఒక్కచోటే అన్ని శాఖల సమాచారం
. జీఎస్టీ అధికారుల సమావేశంలో సీఎం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : జీఎస్టీ వసూళ్లలో దేశానికి ఆదర్శంగా ఏపీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేంద్ర- రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు ఏ, కేంద్ర రాష్ట్రాల జీఎస్టీ అధికారులు హాజరయ్యారు. డేటా అనలటిక్స్ వంటి సాంకేతికతను వినియోగించి ఎగవేతలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమర్థవంతమైన పన్ను వసూళ్ల ప్రక్రియ ద్వారా జాతీయ సంపదను పెంచాలని సీఎం సూచించారు. అది ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపకరించాలని సీఎం అన్నారు. దీనికోసం జీఎస్టీ రియలైజేషన్ కోసం కేంద్ర- రాష్ట్రాల అధికారుల మధ్య సమాచార సమన్వయం ఉండాలన్నారు. జీఎస్టీ వసూళ్లకు సంబంధించి పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా కార్యాచరణ ఉండాలని అన్నారు. పన్ను వసూళ్ల సమాచారాన్ని డేటా అనలటిక్స్ ద్వారా విశ్లేషించాలని, ఎగవేతలను గుర్తించేందుకు విద్యుత్ వినియోగం లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఏపీలో ఎలాంటి పన్ను ఎగవేతలకు అవకాశం లేకుండా చూడాలని జీఎస్టీ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
డేటా లేక్ ద్వారా సమాచారం పంచుకుంటాం
ప్రతి వ్యవస్థా సమర్థంగా పని చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెట్టుబడులను ఆకర్షించటంలో ఏపీ దేశంలో 4 స్థానంలో ఉందని, అన్ని రంగాల్లోనూ ఏపీ అత్యుత్తమం గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేసినందు వల్లే తెలంగాణా రాష్ట్రానికి 75 శాతం మేర ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని, ఇప్పుడు ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి నగరాలు కూడా అదే స్థాయికి చేరుస్తామని అన్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్లలో ఎక్కడా పొరపాటు జరక్కుండా చూసుకోవాలని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమాచారాన్ని ఒకచోటకు చేర్చి డేటా లేక్ ను రూపొందిస్తుందని ఈ సమాచారాన్ని కేంద్ర జీఎస్టీ అధికారులకూ అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వనరులు సమృద్ధిగా ఉంటే ప్రతి చిన్న అంశానికీ కేంద్రం వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. సీఐఐ లాంటి సంస్థలతో కలిసి పన్ను ఎగవేతల్లేకుండా అవగాహన కల్పించాలని, అప్పటికీ అదుపులోకి రాకపోతే కఠినంగా వ్యవహ రించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సెంట్రల్ జీఎస్టీ జోనల్ కార్యాలయం, క్వార్టర్ల నిర్మాణం కోసం అమరావతిలో 5 ఎకరాల భూమి ని కేటాయించాలని కేంద్ర అధికారులు ఈసంద ర్భంగా ముఖ్యమంత్రికి విన్నవించారు. అనంతరం ఆదాయార్జన శాఖలైన వాణిజ్యం, మున్సిపల్, మైనింగ్, ఎక్సైజ్, స్టాంపులు, రిజస్ట్రేషన్, పంచాయితీరాజ్ శాఖలపై సీఎం సమీక్షించారు.


