Monday, June 23, 2025
Homeప్రజలతో విశాలాంధ్ర మమేకం

ప్రజలతో విశాలాంధ్ర మమేకం

. చారిత్రక అపురూప పత్రిక… తెలుగు రాష్ట్రాల్లో చెరగని ముద్ర
. పేదల కోసమే కమ్యూనిస్టుల ఉద్యమం
. సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్‌ ఆలపాటి సురేశ్‌
. ఘనంగా విశాలాంధ్ర 73వ వార్షికోత్సవ సభ

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : ప్రజలతో నిరంతరం మమేకమైన విశాలాంధ్ర దినపత్రిక ఎప్పటికీ ఒక చారిత్రక అపురూపమైన పత్రికగా విలసిల్లుతోందని, ఎన్ని కష్టాలు ఎదురైనా తనదైన శైలిలో ముందుకు సాగుతోందని సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్‌ ఆలపాటి సురేశ్‌ కుమార్‌ అన్నారు. విశాలాంధ్ర చరిత్ర ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మిళితమై ఉందని కొనియాడారు. విజయవాడ చంద్రం బిల్డింగ్స్‌లో విశాలాంధ్ర జాతీయ దినపత్రిక 73 వార్షికోత్సవ సభను విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలపాటి సురేశ్‌ కుమార్‌ ప్రసంగిస్తూ విశాలాంధ్ర వార్షికోత్సవానికి రావడం తన అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా దినపత్రిక జర్నలిస్టులకు, సిబ్బందికి, యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసిన, చూసిన జర్నలిస్టు రాఘవాచారి అని... ఆయన హయాంలో తన జర్నలిజం ప్రస్థానాన్ని ఆలపాటి గుర్తుచేసుకున్నారు. విశాలాంధ్రకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ అద్భుతమని, భాషా ప్రయుక్త రాష్ట్రాల్లోనూ తనదైన చెరగని ముద్ర వేసుకుందని నొక్కి చెప్పారు. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో విశాలాంధ్ర మరింతగా ప్రజలతో మమేకం అయ్యేలా విస్తరించాలని, ఇందుకోసం అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ వర్తమాన అంశాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రజా సమస్యలు, ప్రజా ప్రయోజనాల్లో మిళితం కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మారుతున్న సాంకేతిక రంగం, సోషల్‌ మీడియా విస్తృతితో విశాలాంధ్రను మల్టీమీడియా రంగం వైపునకు మళ్లించాలని, కాలానుకనుగుణంగా మరింత గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలని కోరారు. తనకు కమ్యూనిస్టులు అంటే ఎంతో గౌరవమని, వారి ఉద్యమాలు, నిరంతరం పేదల కోసం పని చేయడం గొప్ప విషయమని అన్నారు. నాటి కమ్యూనిస్టుల చారిత్రక అవసరం మళ్లీ పునరావృతం కావాలని ఆకాంక్షించారు. దేశంలో పేదరికం 202223 వివరాల ఆధారంగా 5.03 శాతానికి తగ్గుముఖం పట్టిందంటూ ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికలోని గణాంకాలు… మనం నమ్మేలా చూపినప్పటికీ… దేశంలో కటిక పేదరికం అంతమాత్రాన తగినట్లు కనిపించడం లేదన్నారు. దేశంలోని 1 శాతం మంది ధనికుల చేతిలోనే 40 శాతం సంపద ఉందని, 50 శాతం పేదల చేతిల్లో కేవలం 3 శాతమే సంపద వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టుల పాత్ర దేశానికి అత్యవసరమని సూచించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ వాస్తవాలకు ప్రతిరూపంగా విశాలాంధ్ర నిలుస్తోందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా విశాలాంధ్ర తనదైన శైలిలో, వామపక్ష భావజాలంతో ఒక విలక్షణమైన జర్నలిజంతో పని చేస్తోందని చెప్పారు. తమిళనాడులో భాషా మెరుగుదల కోసం ప్రభుత్వం ప్రతి ఏటా ఒక అధ్యయనం నిర్వహిస్తుందని, అదే తరహాగా తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ప్రస్తుత తరుణంలో రాజకీయంతో పాటు సాహిత్యం, కళలు, జర్నలిజం వ్యాపార మయంగా మారిన హీన సంస్కృతి దాపురించిందన్నారు. దీనిని మనం తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచి ఉద్యమాలతో మమేకమై ప్రజాప్రతినిధులుగా ఎదిగిన వారిలో నైతిక విలువలు ఉండేవని, నేడు ఎమ్మెల్యే టికెట్లను డబ్బులతో కొనుగోలు చేయడం వల్ల రాజకీయం పూర్తిగా అవినీతిమయమైందని విమర్శించారు. టీవీలలో చర్చా వేదికలూ రెండుగా విడిపోయాయని, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేదీ కనిపించకుండా పోయాయని తెలిపారు.
ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 73 ఏళ్లుగా తెలుగు భాషాభివృద్ధికి విశాలాంధ్ర అలుపెరగని కృషి చేస్తోందన్నారు. ఆనాటికి… నేటికీ తన లక్ష్యం పట్ల వెనక్కి తగ్గకుండా నిరంతరం ప్రజాపక్షం కోసం తపిస్తోందని చెప్పారు. విశాలాంధ్రలో సుదీర్ఘకాలం పాటు ఎడిటర్‌గా పని చేసిన సి.రాఘవాచారి పేరుతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ను ఏర్పాటు చేయడం గర్వకారణమని అన్నారు. అలాంటి చైర్మన్‌ హోదాలో తొలిసారిగా వార్షికోత్సవ సభకు ఆలపాటి సురేశ్‌ రావడం అభినందనీయమని చెప్పారు.
విశాలాంధ్ర ఎడిటర్‌ ఆర్వీ రామారావు మాట్లాడుతూ విశాలాంధ్ర నిరంతరం గొప్ప పత్రికగా ఎదుగుతోందన్నారు. పత్రిక ప్రారంభం నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పాఠకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు.
విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ విశాలాంధ్రకు మొదటి నుంచి ఎన్ని కష్ట, నష్టాలు ఎదురైనా తన ఆశయ సాధన కోసం శ్రమిస్తోందన్నారు. ఎంతోమందిని మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దిందన్నారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్‌ మేనేజర్‌ పి.హరినాథ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భావజాలం, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా విశాలాంధ్ర పని చేస్తోందన్నారు.
విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ కూన అజయ్‌బాబు సభకు స్వాగతం పలుకుతూ ఆలపాటి సురేశ్‌ కుమార్‌ జర్నలిజం ప్రస్థాన వివరాలు వెల్లడిరచారు. ఈ సభకు విశాలాంధ్ర డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ టి.మనోహర్‌ నాయుడు వందన సమర్పణ చేశారు. తొలుత ప్రజానాట్య మండలి రాష్ట్ర కోశాధికారి పిచ్చయ్య గేయాలను ఆలపించారు. వేదికపై విశాలాంధ్ర విజ్ఞాన సమితి సభ్యులు పి.దుర్గాభవాని ఆశీనులయ్యారు. అనంతరం విశాలాంధ్ర విజ్ఞాన సమితి అధ్వర్యంలో సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్‌ ఆలపాటి సురేశ్‌కుమార్‌ను సన్మానించారు.
పరకాల జ్ఞాపకార్థం రూ.5 వేల విరాళం
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, విశాలాంధ్ర పూర్వ సంపాదకవర్గ సభ్యులు అమరజీవి పరకాల పట్టాభిరామారావు జ్ఞాపకార్థం వారి కుమార్తె ఉషాదేవి, అల్లుడు సీబీఎస్‌ పట్టాభిరామారావు విశాలాంధ్ర 73వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూ.5 వేలు విరాళంగా అందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఉషాదేవి ఫోన్‌ ద్వారా విశాలాంధ్ర వార్షికోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 73 ఏళ్లుగా అవిశ్రాంతంగా పత్రికను తీసుకురావడం చెప్పుకోదగ్గ విషయమని అన్నారు. విశాలాంధ్ర ద్వారా తాము ఎంతో స్ఫూర్తి పొందామన్నారు. పట్టాభి, ఆయన సతీమణి అహల్యాదేవి వర్థంతి సందర్భంగా పరకాల కుటుంబ సభ్యులు ఏటా విశాలాంధ్రకు విరాళం అందజేస్తుంటారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు