బారాబంకి: అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్నిర్మాణం అసాధ్యమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్ప్పుకొచ్చారు. బారాబంకిలోని శ్రీరామ్ జానకి ఆలయంలో మంగళవారం జరిగిన 10వ శ్రీ హనుమాన్ విరాట్ మహాయజ్ఞం, శ్రీ రామార్చా పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ కొందరు అవకాశవాదులు ఉంటారని, వారికి కష్టాలు వచ్చినప్ప్పుడే రాముడు గుర్తుకు వస్తాడని, ఇతర సమయాల్లో తలవను కూడా తలవరని అన్నారు. అందువల్లే రాముడు కూడా వాళ్లను మరిచిపోతాడని చెప్పారు. ‘రాముని భక్తులపై బుల్లెట్లు కురిపించి… రాముడి సేవకు అవాంతరాలు కల్పించే రామద్రోహులకు ఇక్కడ చోటులేదు. బాబ్రీ మసీదును పునర్నిర్మిస్తామని కలలు కంటున్న వారికి ఒకటే చెప్పదలచుకున్నారు. అలాంటి తీర్పుదినం (ఖయామత్) ఎప్పటికీ రాదు’ అని అన్నారు. ‘ఖయామత్ రోజు ఒకటి వస్తుందంటూ ఎదురుచూపులు చూస్తూ జీవితం గడిపేయవద్దు. హిందూస్థాన్లో కలిసి జీవించడం నేర్చుకోవాలి. ఈ ధరిత్రి చట్టాలను గౌరవించాలి. మీరు చట్టాన్ని గౌరవించి, ఆ ప్రకారం నడుచుకుంటే లబ్ధి పొందుతారు. లేదంటే మార్గం చాలా స్పష్టంగా ఉంది. చట్టాన్ని ధిక్కరించి ముందుకు వెళ్లే వాళ్లు నరకానికే వెళ్తారు. చట్టాన్ని ధిక్కరించగలమని ఎవరైనా అనుకున్నా, స్వర్గానికి వెళతామని అనుకున్నా వారి కలలు ఎప్పటికీ కల్లలుగానే మిగిలిపోతాయి’ అని యోగి పేర్కొన్నారు.


