తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగలు మరింత రాజుకున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ మెంబర్షిప్ డ్రైవ్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలను గుర్తుచేస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు నిలిచిపోతుందని గతంలో కేసీఆర్ చెబితే.. మేమేమన్నా దీవానాగాళ్లమా.. మాకు ధిమాక్ లేదా అని ఒకాయన మాట్లాడారు. మరి ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా, ఇప్పటికే నాలుగుసార్లు రైతుబంధును ఎగ్గొట్టారు. మరి ఇప్పుడు నిన్ను దీవానాగాడు అంటే తప్పా? ధిమాక్ లేనోడు అంటే తప్పా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రజలు తాను తిట్టిన తిట్ల కంటే ఎక్కువగా కాంగ్రెస్ నేతలను తిడుతున్నారని, ఎక్కడైనా దొరికితే తన్నేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో వడ్లు కొనడం లేదని, యూరియా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతులు కష్టపడి పంట పండిద్దామంటే అటు రైతుబంధు వేయడం లేదని, ఇటు కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని, గ్రామాల్లో రైతులు చెప్పలేని గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన జిల్లాల ప్రజలంతా ఇవాళ తిరుగుబాటు మూడ్లో ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు తరిమికొడదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.


