డీజే మోహనరావు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ నెల 2వ తేదీన, దేశీయంగా అభివృద్ధి చేసిన శక్తిమంతమైన లాంచ్ వెహికల్ మార్క్-3 రాకెట్ ద్వారా, భారత నావికాదళానికి చెందిన అత్యంత అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-7ఆర్
(సీిఎంఎస్-03)ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ విజయం ఇస్రోకు గొప్ప సాంకేతిక మైలురాయి మాత్రమే కాదు, దేశ రక్షణ సామర్థ్యాలను ఇది గణనీయంగా పెంపొందించింది. అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించాలనే భారతదేశ లక్ష్యానికి ఇది తిరుగులేని నిదర్శనం. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సాయంత్రం 5.26 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం.3 రాకెట్కు ‘బాహుబలి’ అనే పేరు ఉంది. ఈ రాకెట్ సుమారు 4,400 కిలోల బరువున్న జీశాట్-7ఆర్ ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ బదిలీ కక్ష్యలోకి (జీటీఓ) విజయవంతంగా చేర్చింది. భారత్ గడ్డపై నుంచి ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇంత బరువైనది ఇదే మొదటిసారి. నిజానికి నాలుగు టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి గతంలో విదేశీ సంస్థలపై ఆధారపడవలసి వచ్చేది. ఇప్పుడు ఎల్వీఎం3 విజయం ద్వారా ఆ సాంకేతిక అవరోధాన్ని ఇస్రో పూర్తిగా తొలగించింది.
ఈ మిషన్లో ఉపగ్రహ ప్రయోగం మాత్రమే కాక, అంతకు మించిన ఒక ముఖ్యమైన సాంకేతిక ప్రయోగం కూడా జరిగింది. జీశాట్-7ఆర్ ఉప గ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత, ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్లోని సీ25 క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఇంజిన్ను అంతరిక్షంలో మళ్లీ మండిరచి చూపారు. ఈ సామర్థ్యం రాకెట్ కార్యాచరణ సౌలభ్యాన్ని అసాధారణంగా పెంచుతుంది. భవిష్యత్తులో ఈ రాకెట్ ఒకేసారి అనేక ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లోకి ఖచ్చితంగా చేర్చడానికి, గగన్యాన్ వంటి మానవ అంతరిక్ష యాత్రలకు అవసరమైన సంక్లిష్టమైన విన్యాసాలను నిర్వహించడానికి ఈ సాంకేతికత పునాదిగా నిలుస్తుంది. జీశాట్-7ఆర్ ఉపగ్రహం భారత నావికాదళానికి ఒక వ్యూహాత్మక వరం. ఇది 2013 నుంచి సేవలందిస్తున్న పాత జీశాట్-7 (రుక్మిణి) ఉపగ్రహం స్థానాన్ని భర్తీ చేస్తుంది. పూర్తిగా దేశీయంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహం, నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, తీర ప్రాంత కమాండ్ కేంద్రాల మధ్య నిరంతరాయంగా, సురక్షితమైన కమ్యూనికేషన్ అనుసంధానాన్ని అందిస్తుంది. ఇది వాయిస్, డేటా, రియల్-టైమ్ వీడియోలను సైతం అత్యధిక వేగంతో పంపగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
శత్రు దేశాల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి జీశాట్-7ఆర్ అత్యాధునిక రక్షణ లక్షణాలను కలిగి ఉంది. ఇందులో ప్రధానంగా జామింగ్ను నిరోధించే సామర్థ్యాలు, ఫ్రీక్వెన్సీ హాపింగ్ సాంకేతికత ఉన్నాయి. ఈ ప్రత్యేకతలు యుద్ధ వాతావరణంలో సైతం నావికాదళ కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా, భద్రంగా ఉండేలా చూస్తాయి. ఈ ఉపగ్రహం యూహెచ్ఎఫ్, ఎస్సీకేయూ, కేఏ వంటి బహుళ-బ్యాండ్లలో పనిచేస్తుంది.
ఈ ఉపగ్రహం హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా పటిష్టమైన టెలికమ్యూనికేషన్ కవరేజీని అందిస్తుంది. ఈ కవరేజీ ఆగ్నేయాసియా వైపు, తూర్పు ఆఫ్రికా తీరం వైపు కూడా విస్తరించి, తీరం నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నావికాదళ ఆస్తులకు సైతం సేవలందిస్తుంది. జీశాట్-7ఆర్ అందించే ఈ మెరుగైన కమ్యూనికేషన్ అనుసంధానం ద్వారా, నావికాదళం యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, గగనతల నిఘా పరికరాలన్నింటినీ ఒకే నెట్వర్క్లోకి తీసుకురాగలదు. ఫలితంగా, నిజ సమయ పరిస్థితులపై అవగాహన పెరిగి వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ జలాల్లో నావికాదళం సమన్వయంతో కూడిన కార్యకలాపాలను వేగంగా నిర్వహించడానికి వీలవుతుంది. అందుకే ఈ ఉపగ్రహాన్ని నావికాదళానికి శక్తి గుణకం అని వ్యవహరిస్తున్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సంక్లిష్టమైన భద్రతా సవాళ్ల మధ్య, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడాలనే భారత నావికాదళ సంకల్పాన్ని జీశాట్-7ఆర్ ప్రతిబింబిస్తోంది. ఈ ఉపగ్రహం పూర్తిగా దేశీయంగా తయారవ్వడం, దేశీయ రాకెట్ ద్వారా ప్రయోగించడం వలన, అత్యవసర సమయాల్లో విదేశీ కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆధారపడాల్సిన అవసరం తప్పింది. ఇది భారత సార్వభౌమత్వానికి, భద్రతకు అత్యంత కీలకమైన అంశం.
8247045230
భారత నావికాదళానికికొత్త శక్తి
- Advertisement -


