. అధికారులు-ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి
. వినూత్న ఆలోచనలతోనే ఆశయ సిద్ధి
. ఐఏఎస్లు ‘బంగారు కుటుంబాలు’ను దత్తత తీసుకోవాలి
. ‘సుపరిపాలనలో తొలిఅడుగు’లో సీఎం చంద్రబాబు
. యోగాడే సక్సెస్పై అధికారులు, ఉద్యోగులకు సన్మానం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సమన్వయం, పొలిటికల్ గవర్నెన్స్తోనే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. యోగా డే స్ఫూర్తితో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని, మనందరి ఉమ్మడి లక్ష్యం 2047 (స్వర్ణాంధ్ర ప్రదేశ్) కావాలని పిలుపునిచ్చారు. ఐఏఎస్ అధికారులు ‘బంగారు కుటుంబాలు’ను దత్తత తీసుకుని.. వాళ్ల ఉన్నతికి కృషి చేయాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో 15 శాతం వృద్ధి రేటు సాధించాలని, నిర్ధిష్ట లక్ష్యాలతో ముందుకెళ్లి… వినూత్నంగా ఆలోచిస్తేనే ఆశయాలు నెరవేరతాయని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం అమరావతి సచివాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సుపరిపాలన తొలిఅడుగు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటో చూపిస్తున్నాం…
డబుల్ ఇంజిన్ సర్కారుతో ఎంత అభివృద్ధి జరుగుతుందో చేసి చూపిస్తున్నాం. కేంద్రం సహకారం లేకుంటే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతామని, పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రజలకు మాటిచ్చాం. ఏడాదిలోనే అన్నీ చేశామని మేం చెప్పడం లేదు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశామని సీఎం వివరించారు. సమన్వయంతో మూడు పార్టీలు కల్సి పనిచేస్తున్నాయని,అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. దక్షిణ భారతదేశంలో నీటి సౌలభ్యం అధికంగా ఉన్న రాష్ట్రం ఏపీ. నదుల అనుసంధానిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేసిందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను కుదేలు చేసి వెళ్లిపోయారు. ఒక్క మైనింగ్ శాఖలోనే రూ.10 వేల కోట్ల ఆదాయం పోయింది. ఒప్పందం చేసుకున్న సోలార్ విద్యుత్ను వాడకపోవడంతో రూ.9 వేల కోట్లను అప్పనంగా చెల్లించాల్సి వచ్చిందని వివరించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం…
ఎన్నికల ముందు చెప్పిన విధంగానే ఎంతమంది పిల్లలున్నా తల్లికివందనం ఇస్తామని చెప్పాం..అందరికీ డబ్బులు ఇచ్చాం. మహిళలకు ఉచిత బస్సును కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తాం. గౌడలకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. మత్య్సకార సేవలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు వేట నిషేధ భృతిని అందించాం.
భోగాపురం విమానాశ్రయాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాం. వచ్చే ఏడాదికి దీన్ని అందుబాటులోకి తెస్తాం. ఒకే ఏడాదిలో రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టాం. పోలవరం ఎడమ కాల్వను పూర్తి చేసి అనకాపల్లికి నీళ్లు అందిస్తాం. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్చి పాత్ హోల్ ఫ్రీ రోడ్లుగా మార్చాం. ఎన్ని కష్టాలున్నా 2024-25 ఆర్ధిక సంవత్సరానికి జీఎస్డీపీలో 12.02 శాతం వృద్ధి రేటు సాధించి రూ.15.93 లక్షల కోట్లు నమోదు చేశామన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను పీ-4 పరిధిలోకి తేవాలని, ఇందుకు ఐఏఎస్లు కూడా సహకరించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగాడే సక్సెస్ చేసిన వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులను సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం సన్మానించారు.
లోకేష్ నేతృత్వంలో యోగా డే కోసం ఏర్పడిన కెబినెట్ సబ్ కమిటీలోని మంత్రులను సీఎం, డిప్యూటీ సీఎంలు అభినందించారు.
కూటమి ప్రభుత్వం రాకుంటే ఏపీ ఏమయ్యేదో: పవన్ కల్యాణ్
గత వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అధికారులు కూడా భయపడ్డారు. ఆఖరికి సీనియర్ నేత చంద్రబాబును కూడా అనేక రకాలుగా వేధించారు. ఇదంతా చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం రాకుంటే ఏపీ ఏమయ్యేదో అనిపించింది.
కుటుంబ సభ్యులతో సహా మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో అందరం ముందుకొచ్చాం.శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదు. మేం చట్టబద్ధంగా వ్యవహరించాలి కాబట్టి పద్ధతిగా ఉంటున్నాం. ఎన్నో దెబ్బలు తిని, ఇక్కడి వరకు వచ్చాం. పిచ్చివేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం. ప్రజల్లో భయాందోళన కలిగించాలని చూస్తే సహించబోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
ఏపీ అభివృద్ధికి అండగా కేంద్రం: పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ సేవలందిస్తోందని చెప్పారు. జీవన్జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికీ నీటిసరఫరా చేస్తున్నామని వివరించారు.