అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో భేటీ
విశాలాంధ్ర బ్యూరో- అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజులు దిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15,16 తేదీల్లో దేశ రాజధాని దిల్లీలో పలు వురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. వీటితో పాటు ఇతర కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లపై కేంద్రమంత్రులతో సీఎం చర్చిస్తారు. అవసరమైన నిధులు, పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలకు రానున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన నిధులు రాబట్టడానికి ఆయన ప్రయత్నించనున్నారు.15వ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. అదేరోజు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, దిల్లీ మెట్రో రైల్ ఎండీతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరగనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 16వ తేదీన కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశం అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్సుకు ముఖ్యమంత్రి హాజరవుతారు.17వ తేదీ ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు దిల్లీ నుంచి అమరావతికి తిరుగు పయనమవుతారు.


