వందలాది మందికి గాయాలు.. క్షతగాత్రులు నాజర్ ఆసుపత్రికి తరలింపు
గాజా నగరంపై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులతో విరుచుకుపడింది. దక్షిణ గాజాలో గురువారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 54 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు రాత్రిపూట 10 వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 54 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వందలాది మంది గాయపడినట్లు చెప్పారు. క్షతగాత్రులను నగరంలోని నాజర్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అలాగే మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర, దక్షిణ గాజాపై బుధవారం జరిగిన వైమానిక దాడుల్లో 22 మంది చిన్నారులు సహా 70 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా పర్యటనలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ దళాలు గాజాపై విరుచుకుపడటం గమనార్హం. ప్రస్తుతం ట్రంప్ గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రాంతీయ పర్యటన కాల్పుల విరమణ ఒప్పందానికి లేదా గాజాకు మానవతా సహాయాన్ని పునరుద్ధరించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.