వాషింగ్టన్: యుద్ధ విమానాల చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన ఎఫ్-22 రాప్టర్ను అమెరికా తయారు చేసింది. ఇప్పుడు ఈ యుద్ధ విమానాన్ని అప్గ్రేడ్ చేసే యోచనలో అగ్రరాజ్యం ఉంది. ఈ విషయాన్ని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడిరచారు. బోయింగ్, జీఈ ఏరోస్పేస్ సీఈవోలు సహా కొందరు వ్యాపారవేత్తలతో దోహాలో మాట్లాడినప్పుడు లాక్హీడ్ మార్టిన్ తయారు చేసిన ఎఫ్-35 ప్రత్యామ్నాయంగా ఎఫ్-55ను అభివృద్ధి చేసే అంశాన్ని ప్రస్తావించారు. ఎఫ్-22 రాప్టర్కు అప్గ్రేడ్గా ఎఫ్-22 సూపర్ఫైటర్ను తయారు చేయనున్నట్లు తెలిపారు. ‘ఎఫ్-55ను తయారు చేయనున్నాం. ఇది రెండు ఇంజిన్లతో మంచి ధరకు లభిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఫైటర్ జెట్ ఎఫ్-22 దానికి సూపర్ వెర్షన్ తీసుకురానున్నాం. ఇది అత్యాధునికంగా ఉండనుంది’ అని ట్రంప్ అన్నారు. ఎఫ్-47 యుద్ధ విమానం అభివృద్ధి ఒప్పందాన్ని బోయింగ్కు ఇవ్వడం విదితమే. అమెరికాలోనే అత్యాధునిక ఆరోతరం ఫైటర్గా ఈ యుద్ధ విమానాన్ని రూపొందించాలని ట్రంప్ అన్నారు. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ సర్కారు ఎఫ్-35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయించేందుకు ఆసక్తి చూపింది. ప్రపంచవ్యాప్తంగా వాడకంలో ఉన్న ఐదవతరం అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్-35. రాడార్లు, ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లుగప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. ఇందులో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాలున్నాయి. దీనిలో మూడు వేరియంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ విమానం అభివృద్ధికి 2 ట్రిలియన్ డాలర్లకు పైగా వెచ్చించారు.
ఎఫ్-55 యుద్ధ విమానాల తయారీపై దృష్టి: ట్రంప్
RELATED ARTICLES