Thursday, June 5, 2025
Homeఆంధ్రప్రదేశ్పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు

పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు

పోలవరం-బనకచర్ల నీటి తరలింపు ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచనుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. సుమారు రూ. 81 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు వివరాలను, దాని ద్వారా రైతులు మరియు ప్రజలకు చేకూరే ప్రయోజనాలను రాష్ట్ర అధికారులు వివరించనున్నారు. గత నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను ప్రధానమంత్రికి, కేంద్ర ఆర్థిక మంత్రికి స్వయంగా వివరించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు సహా ఇతర ఉన్నతాధికారులు నేడు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ కి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

ఈ ప్రజెంటేషన్‌లో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు కేంద్రానికి అందించనున్నారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణకు సంబంధించిన అంశాలు, ప్రజలకు కలిగే లాభనష్టాలపై స్పష్టమైన చిత్రాన్ని ఇవ్వనున్నారు. అంతేకాకుండా, భవిష్యత్తులో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ఆర్థికంగా స్వీయ సమృద్ధి సాధించేలా ఉంటుందని, ఒక స్వయం సమృద్ధ ఆర్థిక ప్రాజెక్టుగా నిలుస్తుందని కూడా వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి వ్యక్తమయ్యే అవకాశం ఉన్న అభ్యంతరాలకు కూడా ఈ ప్రజెంటేషన్‌లో సమాధానాలు ఇచ్చేలా ఏపీ అధికారులు సన్నద్ధమైనట్లు సమాచారం. ఈ సమావేశం ద్వారా ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు