‘పోలవరం-బనకచర్ల’పై కేంద్రానికి వివరణ
రాష్ట్ర ప్రతిపాదనలు తెలిపిన అధికారులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ముందు తన ప్రతిపాదనలు ఉంచింది. సోమవారం న్యూదిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఏపీ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూశ్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని ఈ ప్రాజెక్ట్పై కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు లేవనెత్తిన అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ప్రాజెక్టు సమగ్ర వివరాలను కేంద్ర ఆర్థిక శాఖకు అందించారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ, ప్రజలకు వచ్చే లాభనష్టాలను వివరించారు. భవిష్యత్తులో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని తెలిపారు. నీటి కరువుతో ఇబ్బందిపడుతున్న వెనుకబడిన రాయలసీమకు ఈ ప్రాజెక్టు శాశ్వత నీటి పరిష్కారాన్ని కల్గిస్తుందని వివరించారు. వీటితోపాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సైతం నీటి సమస్య తీరనుందని తెలిపారు. దాదాపు 80 లక్షల మంది ప్రజలకు ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం కల్గుతుందని వివరించారు. ఈ ప్రాజెక్ట్పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాల గురించి కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఏపీ అధికారులు వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు తన దిల్లీ పర్యటనలో భాగంగా వివరించారు. అలాగే ఈ ప్రాజెక్ట్పై జలవనరుల శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. నదుల అనుసంధానంతోపాటు దేశంలో అనేక ప్రాజెక్టులు చేపడుతున్న వేళ.. రాయలసీమలోని జిల్లాలకు బనకచర్ల ద్వారా నీరు అందాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఆ లేఖలో స్పష్టం చేశారు. గోదావరి వరదనీటిని సముద్రంలోకి వృథాగా పంపే కంటే.. బనకచర్ల ద్వారా రాయలసీమతోపాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పంపడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.81 వేల కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం కోరారు. ఈ అంశాలన్నింటినీ అధికారులు కేంద్రానికి సమగ్రంగా వివరించారు.