జగన్కు లోకేశ్ సవాల్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ సోమవారం బహిరంగ సవాల్ విసిరారు. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు అన్నారు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్కు కొత్తేమీ కాదు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయి చొప్పున భూములు కట్టబెట్టారంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా… ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీపార్క్ హిల్-3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. కాపులుప్పాడలో ఎకరం రూ.యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. బురదజల్లి ప్యాలెస్ లో దాక్కోవడం కాదు… చేసిన ఆరోపణలు నిరూపించండి. చాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి గారు? అంటూ లోకేశ్ ప్రశ్నించారు. ‘మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేక పోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది ’ అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.