న్యూదిల్లీ: నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్ ఎగ్జామినేషన్స్ బోర్డ్ (ఎన్ఈబీ) అభ్యర్థనకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. జూన్ 15వ తేదీన జరగాల్సిన పరీక్షను ఆగస్టు 3వ తేదీన నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం… పరీక్ష వాయిదాపై కేంద్రాన్ని, ఎన్ఈబీని ప్రశ్నించింది. ‘ఇంకా రెండు నెలలు పరీక్ష వాయిదా వేయటం ఎందుకు… జులై రెండు లేదా మూడో వారంలో పరీక్ష నిర్వహించవచ్చుగా’ అని అడిగింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ స్పందిస్తూ…‘లాజిస్టికల్ సవాళ్ల కారణంగా పరీక్ష వాయిదా పడిరది. పరీక్ష కేంద్రాల సంఖ్య రెట్టింపు చేయడం, కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడం వంటి వాటి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. చిన్న పొరపాట్లు పరీక్ష ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే పరీక్షను వాయిదా వేయడానికి ఎన్ఈబీ నిర్ణయించింది’ అని తెలిపారు. అనంతరం న్యాయమూర్తి మిశ్రా మాట్లాడుతూ ‘పరీక్ష ఎప్పుడు జరిగినా నిష్పక్షపాతంగా, సమగ్ర భద్రతతో జరగాలి’ అని స్పష్టం చేశారు. గత వారం ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అప్పటి నుంచి మీరు ఏం చేశారంటూ ఎన్ఈబీని ప్రశ్నించింది. ‘పరీక్ష విషయంలో మేము ఏమాత్రం రాజీ పడదలచుకోవడం లేదు’ అని బోర్డు స్పష్టం చేసింది. రెండు షిఫ్ట్ల్లో పరీక్ష నిర్వహణకు బోర్డు చేసిన విజ్ఞప్తిని గతంలోనే సుప్రీంకోర్టు నిరాకరించింది. ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని స్పష్టంచేసింది. చివరికి ఆగస్టు 3వ తేదీన పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది.