. వెంటనే ఆపరేషన్ బుడమేరు అమలు
. అరకొర పనులతో చేతులు దులుపుకోవద్దు
. 14న నిరసన దీక్ష: రామకృష్ణ
విశాలాంధ్ర – విజయవాడ: వరద బీభత్సంతో విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు పనులుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరించడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ఆపరేషన్ బుడమేరు వెంటనే చేపట్టాలని కోరుతూ సీపీఐ ఎన్టీఆర్ జిల్లా సమితి అధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం శుక్రవారం విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షత వహించారు. రామకృష్ణతో పాటు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, విశ్రాంత ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ కంభంపాటి పాపారావు, ఐఎఫ్టీయూ నాయకులు ప్రసాద్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పాల్గొన్నారు. అపరేషన్ బుడమేరును అమలు చేయాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ 8 నెలల క్రితం వచ్చిన బుడమేరు వరదల వల్ల కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ముంపునకు కారణమైన అన్ని అంశాలను పరిశీలించి ఆపరేషన్ బుడమేరు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు బుడమేరు డైవర్షన్ కాల్వ మరమ్మతులు అరకొరగా చేపట్టి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి… బుడమేరు ప్రక్షాళన పనులు చేపట్టి… వరదల నుండి విజయవాడ, పరిసర ప్రాంతాల ప్రజలను, పంట భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఇప్పటికీ రెండుసార్లు సీపీఐ అధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేసినట్లు రామకృష్ణ గుర్తుచేశారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. కంభంపాటి పాపారావు మాట్లాడుతూ బుడమేరు వరద నివారణకు శాశ్వత పరిష్కారాలు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే విజయవాడ నగరం యేటా ముంపునకు గురవుతుందని హెచ్చరించారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ పైభాగాన అవసరమైన జలాశయాలు నిర్మించి వరద ముంపును కొంతమేరకు తగ్గించవచ్చన్నారు. రాయనపాడు నుండి గుంటుపల్లి మీదుగా కృష్ణానదికి మరొక డైవర్షన్ ఛానల్ ఏర్పాటు చేయాలని సూచించారు. దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది విజయవాడలో 10 కిలోమీటర్ల మేర బుడమేరు ప్రవహిస్తూ 32 డివిజన్లను ఇబ్బందులకు గురిచేస్తోందని, ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా సంభవిస్తుందని చెప్పారు. ఆపరేషన్ బుడమేరులో భాగంగా ఎనికేపాడు అండర్ టన్నెల్ను వెడల్పు చేసి ఎనికేపాడు నుండి సముద్రం వరకు బుడమేరు కాలువపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. బుడమేరు ప్రవాహం సాఫీగా జరగాలంటే నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించి… ఆపరేషన్ హైదరాబాద్ తరహాలో ఆపరేషన్ బుడమేరును చేపట్టి…ఆక్రమణలు తొలగించాలని కోరారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని కోరుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని జూన్ 14న విజయవాడలో నిరసన దీక్ష నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు దోనేపూడి శంకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్, నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, బహుజన దళిత హక్కుల నేత కొర్రి వినయ్ కుమార్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి బృందం విప్లవ గీతాలు ఆలపించింది. సీపీఐ కృష్ణాజిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ స్వాగతం పలకగా జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేశ్ స్పందన సమర్పణ చేశారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బుట్టి రాయప్ప, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గా భవాని, రైతు సంఘం నాయకులు మల్నీడి యలమందరావు. ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు షేక్ నజీర్, ఆర్.పిచ్చయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ఆర్గనైజింగ్ కార్యదర్శి యుగంధర్, గండాల సంతోశ్ కుమార్, ఏఐవైఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు పాల్గొన్నారు.