. పరీక్షా కేంద్రాల దగ్గర సందడి
. 30 వరకు ఆన్ లైన్లో నిర్వహణ
. రోజుకు రెండు విడతలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా డీఎస్సీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా పరీక్షలు రాయనున్నారు. ప్రతి రోజూ రెండు విడతలుగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఒక విడత, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండో విడత పరీక్షలు ఉంటాయి. ఒక్క నిముషం ఆలస్య మైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమన్న పాఠశాల విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో ముందస్తుగా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో గంటన్నర ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఆన్ లైన్ పరీక్ష కావటంతో బయోమెట్రిక్ నమోదు, ఇతర ప్రక్రియలు ఉన్నందున అభ్యర్థులు వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యా శాఖ అధికారులు సూచించారు. తొలిరోజు ఆయా పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి నెలకొంది. ఏపీలో 137, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలకు హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తీసుకెళ్లారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టడీ మెటీరియల్ను నిషేధించారు. డీఎస్సీలో భాగంగా మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయను న్నారు. వాటి కోసం 3,36,305 మంది అభ్యర్థులు 5,77,417 దరఖాస్తులు చేశారు. తమ అర్హతలకు అనుగుణంగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో అభ్యర్థుల కంటే దరఖాస్తుల సంఖ్య పెరిగింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చేందుకు అన్ని జిల్లా కేంద్రాలలో సీసీటీవీలు ఏర్పాటు చేశారు. డీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్సీ పరీక్షకు తొలి రోజు ఉదయం విడతలో 88 శాతం, మధ్యాహ్నం విడతలో 86 శాతం మంది అభ్యర్థులు హాజరయినట్లు పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు తెలిపారు.