. బోయపాటి పేరుతో వెలసిన నోటీసు బోర్డులు
. విలువైన భూమి కొట్టేయడానికి కుట్రలు
. ప్రభుత్వ అండతో ఆలపాటి ఆగడాలు
. విద్యార్థి సంఘాల ఆగ్రహం
విశాలాంధ్ర – విజయవాడ : విజయవాడ నగరం నడి బోడ్డున గల శాతవాహన కళాశాల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కళాశాల భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు. అంతటితో ఆగకుండా బోయపాటి శ్రీనివాస అప్పారావు పేరుతో ఆ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేశారు. కాలేజీ యాజమాన్యం మధ్య విభేదాలే కూల్చివేతకు కారణంగా కనిపిస్తోంది. కొన్నేళ్లుగా కోర్టుల్లో కేసులు సైతం నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాసరావును టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వర్గీయులు కిడ్నాప్ చేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కళాశాల ఆస్తి కాజేయడానికి తనపై ఒత్తిడి తీసుకువచ్చారని ప్రిన్సిపాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా కాలేజీని బోయపాటి అప్పారావు వర్గీయులు నేలమట్టం చేశారు. కాలేజీ స్థలం తమదేనని పేర్కొంటూ బోయపాటి శ్రీనివాస అప్పారావు పేరిట నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. తమకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో కూల్చివేసినట్లు బోయపాటి శ్రీకృష్ణ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామని చెప్పారు. కూల్చివేత సమాచారం ఆలస్యంగా అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకోగా అప్పటికే పొక్లెయిన్లతో కళాశాల భవనాలు, షెడ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. తమకు ఎటువంటి కోర్టు ఉత్తర్వులు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. భవనాల కూల్చివేతతో విద్యార్థుల రికార్డులు, లైబ్రరీకి సంబంధించి పెద్దఎత్తున పుస్తకాలు, ఫర్నీచర్ శిథిలాలు కింద ఉండిపోయాయి. దీంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విలువైన భూమి కాజేయడానికి ప్రభుత్వ అండదండలతో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. అతి తక్కువ ఫీజుతో పేద విద్యార్థులకు విద్యనందిస్తున్న కాలేజీని నిర్ధాక్షిణ్యంగా కూల్చివేడం దారుణమని, కొంతమంది స్వార్ధం కోసం విద్యార్థులను బలిచేస్తున్నారని మండిపడ్డారు.
బోధన బృందం, సిబ్బంది ఆందోళన
గత 50 ఏళ్లుగా శాతవాహన కళాశాల నడుస్తోందని, ఎంతోమంది పేద విద్యార్థులు ఇక్కడ చదివి ఉన్నతస్థాయికి ఎదిగారని కళాశాల బోధన బృందం, సిబ్బంది తెలిపారు. సొసైటీలో నెలకొన్న వివాదాల కారణంగా అర్ధంతరంగా కళాశాలను కూల్చివేయడం సరికాదని, తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కళాశాలలో 400 మంది విద్యార్థులు చదువుతున్నారని, 25 మంది బోధన బృందం, సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. కళాశాల స్థలం కొనుగోలు కోసం ప్రతి అధ్యాపకుడు రూ.4 లక్షలు చెల్లించాడని, ఇప్పటికీ తమ వద్ద రశీదులు ఉన్నాయని తెలిపారు. కూల్చివేత శిథిలాల కింద విద్యార్థులకు సంబంధించిన విలువైన రికార్డులు ఉన్నాయని, ప్రిన్సిపాల్కు కనీసం సమాచారం ఇవ్వకుండా ఈ చర్యలకు పాల్పడటం కలిచివేసిందన్నారు. మరోవైపు, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కళాశాల భవనాలు కూల్చివేసిన ఘటనలో బోయపాటి శ్రీకృష్ణపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, వైసీపీ విద్యార్థి సంఘాల అధ్వర్యంలో శుక్రవారం చుట్టుగుంటలోని శాతవాహన కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. యాజమాన్యానికి వత్తాసు పలికిన కళాశాల ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాసరావును అడ్డుకున్నారు. విద్యార్థి నేతలకు, ప్రిన్సిపాల్కు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మాట్లాడుతూ ఐదు దశాబ్దాల ఘన చరిత్ర గల శాతవాహన కళాశాల భవనాలను అక్రమంగా కూల్చివేసి… విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారని దుయ్యబట్టారు. శాతవాహన కళాశాల హక్కుదారుడిగా సుప్రీంకోర్టు తీర్పు బోయపాటి శ్రీనివాస అప్పారావుకు అనుకూలంగా వచ్చిందని, భవనాలు కూల్చివేయాలని తీర్పు ఇవ్వలేదన్నారు. పోలీసులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా భవనాలు కూల్చేయడం దుర్మార్గమని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన ఈ సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా వర్గీయులు కిడ్నాప్ చేసి బలవంతంగా సంతకం చేయించారని చెప్పిన ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాసరావు భవనాల కూల్చివేతపై ఎందుకు మౌనం వహించారని నిలదీశారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే కిడ్నాపులు చేసి బలవంతంగా ఆస్తులు, భూములు లాగేసుకుంటున్న దుర్మార్గ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. ఇంతటి దారుణ ఘటనపై విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ జోక్యం చేసుకోవాలని, శాతవాహన కళాశాలను పరిరక్షించాలని కోరారు. ధర్నాలో ఏఐఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తీక్, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి, నాయకులు గోపీచంద్, ఆనంద్, సురేంద్ర, రమేశ్, అజహర్, పూజిత్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.