Wednesday, June 25, 2025
Homeపెట్టుబడులు రావాలి…పేదరికం పోవాలి

పెట్టుబడులు రావాలి…పేదరికం పోవాలి

. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి
. వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు
. ఫిక్కి సమావేశంలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, పేదరికం పోవాలని, వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రోత్సాహకాలిస్తామని సీఎం చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. పేదలకు-ధనవంతులకు మధ్య అంతరాలను తగ్గించాలన్నారు. ఐదేళ్ల పాలనను పెట్టుబడిదారులు మరిచిపోవాలని, ఆ భూతం మళ్లీ రాదని, ఎలాంటి భయాలు లేకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చని సీఎం భరోసానిచ్చారు. విజయవాడలో బుధవారం జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఫిక్కీ ప్రతినిధులకు… సమావేశానికి హాజరయిన వివిధ కంపెనీలకు చెందిన యాజమాన్యాలకు వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏయే రంగాలపై ఉన్నాయనే విషయాన్ని పెట్టుబడిదారుల దృష్టికి తీసుకెళ్లారు. విధానపరంగా పేదరికం లేని సమాజాన్ని భావితరాలకు అందివ్వడమే తన బాధ్యతని స్పష్టంచేశారు. పెట్టుబడులు మొదలుకుని… రాజకీయాల వరకు… చరిత్ర మొదలుకుని… భవిష్యత్‌ అంచనాల వరకు ఇలా వివిధ అంశాలపై చంద్రబాబు తన అంతరంగాన్ని వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని, వెనుకబడిన ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేలా విధానం తెస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాయలసీమ ప్రాంతం గ్రీన్‌ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్‌, డిఫెన్స్‌, హైటెక్‌ ఇండస్ట్రీస్‌, ఏరో స్పేస్‌ రంగాలకు అనువుగా ఉంటుందని, ఉత్తరాంధ్ర జిల్లాలకు గూగుల్‌ సంస్థలు రానున్నాయని తెలిపారు. విశాఖ కేంద్రంగా సింగపూర్‌-విశాఖకు సీ-కేబుల్‌ వేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో రసాయన, ఔషధ, పర్యాటక, స్టీల్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి అనువుగా ఉంటుందని, గోదావరి జిల్లాల్లో ఆక్వా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలకు అవకాశం ఉంటుందని వెల్లడిరచారు. అమరావతి సమీప ప్రాంతాల్లో ఏఐ, క్యాంటమ్‌ వ్యాలీ, ఇన్నోవేషన్ల వంటి అంశాలపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. మీకు అనువైన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుని ఐటీని ప్రోత్సహించానని, ఇప్పుడు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, ఏఐ వంటి రంగాలపై దృష్టి పెట్టానని చెప్పారు. మారిన కాలంలో డేటాతో సంపద సృష్టి అనేది కీలకమైనదంటూ… ఈ రంగాలపై ప్రభుత్వం ఎలాంటి విధానాలు అవలంభిస్తుందో చంద్రబాబు వివరించారు. సాంకేతిక ద్వారా సామాన్యునికి సేవలు అందించడంతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు అని, సాంకేతికతతో నేరాలను కట్టడి చేయవచ్చు అని అన్నారు. ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాంకేతికతను ఉపయోగించుకోవచ్చునని… దీంతో ఆస్పత్రి ఖర్చులు కూడా తగ్గుతాయని సూచించారు. ప్రజారోగ్యం విషయంలో బిల్‌ గేట్స్‌ ఫౌండేషనుతో కలిసి పని చేస్తున్నామని, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నాన్నారు. నవంబరు నాటికి పూర్తి స్థాయిలో ఆధార్‌ అథంటికేషన్‌ చేపడుతున్నామని, అన్ని కుటుంబాల యూనిట్‌గా తీసుకుని జియో ట్యాగింగ్‌ చేస్తున్నామని తెలిపారు. దాదాపు 50 అంశాలకు సంబంధించిన విషయాల్లో డేటాను పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఉంచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు పారిశ్రామికవేత్తలు, ధనవంతులు ముందుకు రావాలంటూ సీఎం పిలుపునిచ్చారు. మిలియన్‌, ట్రిలియన్‌ డాలర్ల ఆస్తిపరులు ఓ వైపు… పూట గడవని పేదవాడు మరోవైపు అన్నట్టుగా ఉన్న అసమానతలు తొలిగేలా పని చేస్తున్నామని, సంపన్నులు సమాజానికి సేవ చేసే సమయమిదని, సమాజం నుంచి ఎంతో తీసుకుని అభివృద్ధి చెందారన్నారు. ఈ అసమానతలను రూపుమాపేందుకు ప్రభుత్వం పీ-4 విధానాన్ని ప్రోత్సహిస్తోందని, దీనికి పారిశ్రామిక వేత్తలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. గతంలో పారిశ్రామిక సదస్సుల్లో ప్రభుత్వం వైపు నుంచి ఎవ్వరూ పాల్గొనే వారు కాదని, దావోస్‌ పెట్టుబడుల సదస్సుకు హాజరయిన తొలి ముఖ్యమంత్రిని తానేనని చెప్పారు. ఇప్పుడు అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నామని, ఇది భవిష్యత్‌ నగరమని, అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ అని అన్నారు. స్వర్ణాంధ్ర`2047 లక్ష్యంగా పని చేస్తున్నామని, 2.47 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి చేరాలని ప్రణాళికలు సిద్దం చేశామని వివరించారు. ఒక్క గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనే ఐదేళ్ల కాలంలో రూ.10 లక్షల కోట్ల మేర పెట్టుబడులు తెచ్చి… 7.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రయత్నిస్తున్నామన్నారు.
ఫిక్కీ పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు ముఖాముఖి
ఫిక్కీ సదస్సుకు హాజరయిన పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు ముఖాముఖి అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వాజ్‌పేయి హయాంలోనే భారతదేశం ఒలింపిక్‌ క్రీడలను నిర్వహించాలనే ఆలోచన చేసిందని, ఇప్పటి వరకు సాకారం కాలేదని, కాంగ్రెస్‌ హయాంలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల వల్ల చెడ్డ పేరు వచ్చిందని వివరించారు.
ఏపీలో క్రీడలకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని, యోగాంధ్రను అద్భుతంగా చేశామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు